భజన చేసే విధము తెలియండీ ....

  

భజన చేసే విధము తెలియండీ..

ఓ సోషల్ మీడియా జనులార మీరూ..

నిజము కనుగొని మోదమందండీ...

...   ...

జ్ఞానులనుకొని ఎగిసి పడకండీ..

ఓ సోషల్ మీడియా జనులార మీరూ..

జ్ఞానులనుకొని ఎగిసిపడి

అజ్ఞానములను బట్టబయలు చేసుకోకండీ...

*    *    *

  

గాడిదలూ, గుర్రాలూ....

పహల్ గాఁవ్ లో ఒక దుర్ఘటన జరిగింది. ఇది కేవలం రాజకీయపరమైనదే కాకుండా, మతమౌఢ్యం కూడా దీనిలో ఇమిడి ఉంది. సర్వ సాధారణంగా ఇటువంటివి జరిగినప్పుడు అది కూడా మనం బాధితుల పక్షాన నిలబడినప్పుడు మతాభిమానం సహజంగానే బుసకొడుతుంది. అయితే దానిని నియంత్రించుకుని... మొదటగా బాధితులకు సాంత్వన చేకూరుస్తూ మొత్తం దేశ ప్రజలు వారికి అండగా నిలబడడం మొదటి కర్తవ్యమయితే...ఇటువంటి రాక్షస చేష్ఠలు మరో మారు జరగకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అంతే ప్రాధాన్యతతో చేపట్టవలసిన బాధ్యత.

 అయితే  ఈ రెంటినీ పక్కనబెట్టి... ముష్కరులతో సమానంగా .. నిజానికి అంతకంటే కూడా రెచ్చిపోయి మతమౌఢ్యాన్ని ప్రదర్శించడంవల్ల గాడిదలకూ, గుర్రాలకూ తేడాలేకుండా పోతున్నది.

 *    *    *

 అంత ప్రళయాలేవీ అక్కర్లేదు....

‘‘మతములన్నియు మాసిపోవును

జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును.....’’

లోకంబులు లోకేశులులోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెంజీకటి.... అంత స్థాయిలో ప్రళయాలేవీ రానక్కర లేదు. ఒక మోస్తరు భూకంపం, ఒక సునామీ, ఆకస్మికంగా అర్థరాత్రి విరుచుకుపడిన వరద చాలు.... మన కళ్ళముందే మతాలన్నీ మాసిపోయి... ఆత్మజ్ఞానం నిలిచి వెలగడానికి.

 *    *    *

 ఏ మతం కూడా నూటికి నూరుపాళ్ళూ పర్ఫెక్ట్ కాదు... అని రూఢీగా చెప్పడానికి... ప్రతి మతంలో పుట్టుకొచ్చిన కుంపట్లే ప్రబల సాక్ష్యం. ఒక కుంపటి మరో కుంపటిని ఒప్పుకోదు.

ఇస్లాంలో- షియా, సున్నీలు ;

క్రైస్తవంలో -రోమన్ కాథలిజం, ఈస్టర్న్ ఆర్థొడాక్స్, ప్రొటెస్టంటిజం ;

బౌద్ధంలో- థెరవాడ, మహాయాన, వజ్రయాన ;

 జైనంలో- శ్వేతాంబరులు, దిగంబరులు ;

సిక్కిజంలో ఖల్సా, నాంధారీ, నిరంకారీ, నిహాంగ్(దళ్ ఖల్సా) వగైరా వగైరా...

 

 ఇక మన కింది నలుపెంతో.....

 హైందవంలో వైష్ణవులు, శైవులు, శాక్తేయులు, గాణపత్యులు, కాపాలికులు...ఇంకా చాలా శాఖలున్నాయి. ఒకటంటే మరొకదానికి నిప్పులో ఉప్పే...ఎంతగా అంటే...

రామజన్మభూమి కోసం బాబ్రీ మసీదును కూలగొట్టి రామ మందిరాన్ని నిర్మించుకున్నట్లే... భారతదేశం మొత్తం మీద ఎన్నో  శివాలయాలను వైష్ణవాలయాలుగా, వైష్ణవాలయాలను శివాలయాలుగా... ఇక తామేమీ తక్కువకాదన్నట్లు బౌద్ధులు, జైనులు వీటిని వారి ఆలయాలుగా మారిస్తే, ప్రతీకారంగా వారి స్థూపాలు, ఆలయాలు శైవ, వైష్ణవ, శక్తి మందిరాలుగా... మారిపోవడం  ... ఇదే కదా తవ్వే కొద్దీ రాశులుగా రాశులుగా కనబడే మన చరిత్ర.. ఘన చరిత్ర.

 కేవలం శైవ మత దురభిమాని లేదా కేవలం వైష్ణవ మత దురభిమాని మతోన్మాది అయినప్పుడు

 శైవాన్ని, వైష్ణవాన్ని, శాక్తేయాన్ని... ఇలా అన్నింటిని అభిమానించేవాడు  సెక్యులరే అవుతాడు... 

అంటే లౌకిక వాదే... అదేదో అంటరాని పదం కాదు.

 దీనిని మర్చిపోయి ఇతర మతాలమీద దాడి చేసే ముందు ... తాలిబన్లు, రజాకార్లకంటే మనం ఎంతో మెరుగు అని చెప్పుకోవడానికి... ఎంతో కొంత మంచి చేయడానికి ...మనం సర్వోత్తములం అని చెప్పుకోవడానికి ఏం చేస్తున్నాం ???

*    *    *

అసలు మతం, కులం ఆధారంగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనకూడదని, ప్రచారం చేయకూడదన్న ఎన్నికల  మౌలిక నియమావళికి ప్రతి ఎన్నికల్లో పాతరేస్తాం.  ఆ పాతర సక్రమంగా వేయడానికి మన మనుషులను అక్కడ నిలబెడతాం. అయినా కోర్టులు అడ్డొస్తున్నాయని వాటి కాళ్ళూ చేతులు కట్టేసి  నడిబజార్లో, నగ్నంగా నిలబట్టి బండ బూతులు తిడతాం.

*    *    *

ఇటువంటివే ప్రాంతీయాభిమానం, భాషాభిమానం కూడా. మనం వేరే దేశాలకు వెళ్ళి అక్కడ అన్ని హక్కులు పొందవచ్చు. మన ప్రాంతంలోమటుకు ఇతరులకు  నోరెత్తే స్వేచ్ఛ కూడా ఇవ్వం. మేం అధికారంలో ఉన్న రాష్ట్రంలో మా భాష ను నిర్బంధంగా ఎక్కిస్తాం. ఇతర రాష్ట్రాల్లో అలా చేస్తే తాట తీస్తాం... ఇదేం ధోరణి ???

*    *    *

అందువల్ల కులాభిమానం, మతాభిమానం  మన కుటుంబాలకే పరిమితం చేసుకుందాం.  అలా అందరూ చేసేవిధంగా పోరాడదాం. ప్రభుత్వాలలోకి, పాలనలోకి అవి రాకుండా జాగ్రత్తపడదాం. రాజులయినా, మంత్రులయినా, రాజకీయ దురంధరులయినా, వారి తైనాతీలయినా  కుల, మత, ప్రాంత, భాషా రాజకీయాలు చేస్తే నరికి పోగులు పెడదాం.

*    *    *

ఏ ఇతర మతంలో లేనిది... కేవలం సనాతన ధర్మంలో విశిష్ఠంగా కనబడేది... ప్రశ్నించడాన్ని ప్రోత్సహించడం.  తప్పు ఎవరు చేసినా అస్మదీయులు చేసినా, తస్మదీయులు చేసినా ... ప్రశ్నించగలగాలి. అస్మదీయులను ప్రశ్నించకపోగా భజనలు చేస్తూ వెనకేసుకొచ్చేవాడికి... సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు కూడా ఉండదు.

-ములుగు రాజేశ్వర రావు

.......

 

 

నా కాశీ యాత్ర-7(ధన్యవాదాలు)

 

ఎండావానాలాగా .....

 2025 మార్చి 6నుండి 19వతేదీ వరకు ... ప్రయాగ్ రాజ్‌తో మొదలైన యాత్ర వారణాశి, సారనాథ్, అయోధ్య, బస్తీ, గోరఖ్‌పూర్‌, కుశీనగర్‌తో ముగిసింది. ఇప్పటి వరకు ఇచ్చిన విశేషాలను చదివి స్పందించిన బంధుమిత్రులు, సామాజిక మాధ్యమాల స్నేహితులందరికీ  హృదయపూర్వక ధన్యవాదాలు.

🙏

ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలో జరిగిన ఈ యాత్రలో సర్వసాధారణంగా అన్ని చోట్లా నాకు విశేషంగా కనబడిన మరికొన్ని అంశాలను క్లుప్తంగా ప్రస్తావిస్తా.

ü  దక్షిణ భారత దేశంలో శాలివాహనశకం క్యాలండరును అనుసరిస్తే, ఉత్తర ప్రదేశ్‌లో దీనితో పాటూ ఎక్కువగా విక్రమశకం క్యాలండరును అనుసరిస్తారు. (భారత ప్రభుత్వం మార్చి 22, 1957 నుండి ధార్మిక అవసరాలకు శాలివాహన శకం క్యాలండరును, అధికారిక కార్యక్రమాలకు గ్రిగేరియన్ క్యాలండరును పరిగణనలోకి తీసుకుంటున్నది)

ü  ఉత్తర భారతదేశంలో ఎక్కువగా మాట్లాడేది హిందీ అయినా తూర్పుఉత్తర ప్రదేశ్‌లో స్థానిక భోజ్‌పురి మాట్లాడతారు. అది కూడా హిందీయే ... కానీ యాసతోపాటూ కొన్ని పదాలు వెంటనే అర్థం కావు. (గోరఖ్‌పూర్ లో 51.3.% భోజ్‌పురి, 46.48% హిందీ, 2.02% ఉర్దూ మాట్లాడతారు). బస్సులమీదా, దుకాణాలు, గుళ్ళూగోపురాల పేర్లన్నీ హిందీలోనే ఉంటాయి. ఇంగ్లీష్ ఎక్కడా కనబడదు.

ü  వారణాశిలో బనారస్ పాన్(కిళ్ళీ) చాలా ప్రఖ్యాతి చెందినదే అయినా అక్కడ ఉన్నప్పుడు తెలియలేదు. తరువాత తెలిసింది. రుచి చూడలేకపోయా.(ఖాయ్కే పాన్ బనారస్ వాలా, ఖులీజాయ్ బంద్ అకల్ కా తాలా...అమితాబ్ పాట దాని ప్రాముఖ్యాన్ని తెలిపేదే)

ü  దక్షిణభారతం కాఫీకి, ఉత్తర భారతం టీకి అని ఒకప్పుడు అనేవారు. ఇప్పుడు మన దగ్గర చాయ్ దుకాణాలు అడుగడుగుకూ కనిపిస్తాయి. అక్కడ అన్ని ఊళ్ళు తిరిగినా...  ఏ ప్రాంతంలో అయినా చాయ్ కావాలంటే (కాఫీ ఎలాగూ దొరకదు)... ప్రయాసపడి చాలా దుకాణాలు, హోటళ్ళు దాటుకుంటూ వెడితే ఒక చాయ్ దుకాణం ఉంటుంది. అక్కడ మనం చాయ్ ఆర్డరిచ్చిన తరువాత పాలు కాచడం, అల్లం దంచడం మొదలవుతుంది. కుల్హడ్‌(మట్టి గ్లాసులు)లలో ఇస్తారు. బహుశా పాలు బాగా చిక్కగా ఉంటాయనుకుంటా... రుచి  మార్వాడీ ఇలాచీచాయ్ లాగా అమోఘం అనలేం కానీ... బాగుంటుంది..మట్టి వాసనతో...

ü  దక్షిణ భారత దేశంలో మధ్యతరగతికి అందుబాటులో ఉండే ఉడిపి, తాజ్, కామత్ వంటి ... అంటే ఆ స్థాయి రెస్టారెంట్లు ఎక్కడా కనిపించలేదు. కట్టెల పొయ్యి ముందువైపు, కస్టమర్లు కూర్చునే భాగం వెనక వైపు ఉండే టైపు హోటళ్లే కనిపిస్తాయి, వెజ్ కయినా నాన్ వెజ్ కయినా.... సంపన్నులయినా, మధ్యతరగతి అయినా, పేదలకయినా అన్నీ అవే.(నేను చూసిన పరిమిత ప్రాంతంలో).

ü  శాకాహారం తాలూకు ఐటమ్స్... ఇళ్ళల్లో అయినా, హోటళ్ళలో అయినా... ఎక్కువగా కనిపించేవి- కచోరీలు, స్టఫ్డ్ పూరి/చపాతీలు...ఆలూ కర్రీతో, లేదా బెండకాయ సాగన్‌తో, సాగ్‌పైతా దాల్(మెంతి, పాలకూర పప్పు), దాల్ తడ్ఖా.. స్వీట్లలో భుజియా(కజ్జికాయలు), పేటా(గుమ్మడి) ప్రత్యేకం ,...దూధ్ పేడా, గులాబ్ జామూన్ మామూలే. ఆలుగడ్డ తాలూకు ఐటమ్స్ తప్పనిసరిగా ఉంటాయి... ఇంటాబయటా ఎక్కడయినా... ప్రతిరోజూ...

ü ఉత్తర ప్రదేశ్‌లో 5 అంతర్జాతీయ విమానాశ్రయాలతో సహా మొత్తం 19 విమానాశ్రయాలున్నాయి. మరో 5 రాబోతున్నాయి.. (గోరఖ్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఢిల్లీనుండి రోజూ ఒకే ఒక విమానం వచ్చిపోతుంటుంది).

ü  దేశంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ ఉత్తర ప్రదేశ్‌లో ఉంది. నార్త్ సెంట్రల్ రైల్వే, ఈశాన్య రైల్వే, ఉత్తర రైల్వే డివిజన్ ప్రధానకేంద్రాలున్నాయి. 9,617 కి.మీ రైల్వేలైను ఉంది. దేశంలో ఇదే అతి పెద్దది.

ü  ఉత్తర ప్రదేశ్‌లో 12,490 బస్సులున్నాయి. మన ఆటోల్లో ముగ్గురికి పరిమితం. అక్కడ ఎక్కువ భాగం బ్యాటరీ ఆటోలు...వెడల్పు మన ఆటోలో మూడు వంతులు ఉంటుంది. నలుగురు ప్రయాణించవచ్చు.

ü చాలా చోట్ల ముఖ్యంగా ట్రాఫిక్ విషయంలో అక్కడ రూల్స్ ఎవ్వరూ పాటించరు. అవి ఉంటాయని బహుశా పోలీసులకుకూడా తెలియదేమో అన్నట్లుగా ఉంటుంది. (మన పాతబస్తీలోలాగే). నోరున్నవాడిదే (కండబలం/ధనబలం ఉన్నవాడిదే) రాజ్యం.

ü  ఎక్కువ విద్యా సంస్థలున్న రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. 6 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు(వివి), 34 రాష్ట్ర వివి, 35 ప్రయివేటు వివి, 8 డీమ్డ్ వివి, 12 పరిశోధనా సంస్థలు, ఐఐటి, ఐఐఎం వంటి 12 ఉన్నత విద్యా సంస్థలు,  ప్రముఖ ఇంజనీరింగ్, ప్రఖ్యాత మెడికల్ కళాశాలలు... ఇలా చాలా ఉన్నాయి,

ü  మౌలిక సౌకర్యాలు, విద్యా సంస్థలు ఇంతగా అభివృద్ధి చెందిన ఒక ప్రముఖ రాష్ట్రం, రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన రాష్ట్రంలో... వెనుకబాటుతనం, నిరక్షరాస్యత నేను తిరిగిన అన్ని ప్రదేశాల్లో ఎక్కువగా కనిపించాయి. .. దీనికి గోరఖ్‌పూర్ ఎక్స్ ప్రెస్ ఒక ప్రబల సజీవ ఉదాహరణ. దీనిలో అత్యధిక శాతం ప్రయాణికులు తెలుగు రాష్ట్రాల్లో ఉపాధికోసం వచ్చిపోయే అక్కడి నిరుద్యోగులు, చిరుద్యోగులు, వలస కార్మికులే.

    అటు(ఉత్తరప్రదేశ్, బీహార్‌ల వైపు) వెళ్ళే రైళ్ళు, బస్సుల ప్రయాణికులకు వారి బంధువులు ఒకటికి వందసార్లు హెచ్చరికలు చేస్తుంటారు(దారిదోపిడీలకు సంబంధించి)... అలాగే మా వాళ్ళు మాకూ   చేసారు.

ü  కొందరిని పలకరించా... కర్నూల్లో కేక్ మాస్టర్ గా ఉద్యోగంలో చేరబోయే ఒక యువకుడు చెప్పిన మాట..‘మాదగ్గర రు.10వేలు ఇస్తారు. కర్నూల్లో భోజనవసతులు ఇచ్చి రు.30వేలిస్తారు. విజయవాడలో కూడా ఇంతే.. అయితే ఇంకొంత ఎక్కువే వస్తుంది అక్కడయితే...’

ü  మరో ముస్లిం యువకుడిని పలకరిస్తే... హైదరాబాదులో సెలూన్ లో పనిచేస్తాడట. ‘‘జీతం ఇచ్చి పర్శంటేజీ ఇస్తారు ఇక్కడ. అక్కడ(గోరఖ్‌పూర్ లో) మాకు జీతం ఒక్కటే అదీ తక్కువే. పర్శంటేజి ఇవ్వరు..’’ అన్నాడు.. ఇప్పుడు హైదరాబాద్‌లో ఆగ్రా హేర్ కటింగ్ సెలూన్ పేరుతో వాళ్ళు సొంతంగా సెలూన్లు కూడా నడుపుతున్నారు.

ü  ఆశ్చర్యం ఏమిటంటే... స్వరాష్ట్రంలో ఉపాధి దొరకక దూరప్రాంతాల్లో ఉంటున్నా.... వీరెవరూ భార్యాబిడ్డలతో బయటి రాష్ట్రాల్లో  సెటిల్ కావడానికి ఇష్టపడడం లేదు.

ü  ఉన్నఊళ్ళో కాస్తోకూస్తో పొలం ఉంటుంది. పొలంపనులన్నీ ఇంటి ఆడవాళ్లు చూసుకుంటారు.  పని వేటలో మగవాళ్ళు ఢిల్లీ, బొంబాయి, బెంగళూరు, హైదరాబాదు వంటి ప్రదేశాలకు వెడతారు. పండగలకు, పబ్బాలకు వెళ్ళి కుటుంబాలతో గడుపుతారు.

..........................


నా కాశీ యాత్ర - (ప్రయాగ రాజ్‌లో...రాజకీయం)

https://rajabhayya.blogspot.com/2025/04/1.html?spref=tw

 నా కాశీ యాత్ర-(వారణాశిలో.. అయోమయం)

https://rajabhayya.blogspot.com/2025/04/2.html?spref=tw

 నా కాశీ యాత్ర-(అయోధ్యలో... అపచారం)

https://rajabhayya.blogspot.com/2025/04/3.html?spref=tw

 నా కాశీ యాత్ర-(స్మశాన భస్మంతో కాశీలో  హోళీ...)

https://rajabhayya.blogspot.com/2025/04/4.html?spref=tw

 నా కాశీ యాత్ర-5 (నాథ్ సంప్రదాయం)

https://rajabhayya.blogspot.com/2025/04/5.html?spref=tw

నా కాశీ యాత్ర-6  (గీతా ప్రెస్-గోరఖ్‌పూర్)

https://rajabhayya.blogspot.com/2025/04/6.html?spref=tw

...................

నా కాశీ యాత్ర-6 (గీతా ప్రెస్)

 

గీతా ప్రెస్-గోరఖ్‌పూర్

(గీతా ప్రెస్ అంటే గోరఖ్‌పూర్, గోరఖ్‌పూర్ అంటే గీతా ప్రెస్.. అంతటి ఖ్యాతి దానిది...అందుకని నేను గోరఖ్‌పూర్ పర్యటనమీద ఎక్కువ అంచనాలు పెట్టుకున్నా. అయితే అంతకంత నిరుత్సాహపడాల్సి వచ్చింది. 

కారణం-నా ఫస్ట్ లవ్ జర్నలిజం కాగా, నా సెకండ్ లవ్ ప్రింటింగ్ ప్రెస్. 1923నుండి అలుపన్నది లేకుండా నడుస్తున్నగీతా ప్రెస్ విషయంలో నా ఆసక్తి... కేవలం వారి ప్రచురణలమీద మాత్రమే కాదు. టెక్నికల్‌గా, ఆర్థికంగా ఆ సంస్థ అప్పటినుంచి ఇప్పటివరకు అభివృద్ధి చెందిన పరిణామ క్రమం- ఆ క్రమంలో వ్యవస్థాపకుల స్వీయ అనుభవాల మీద కూడా...

నా అంతరంగాన్ని ఇంతకంటే స్పష్టంగా ఇంగ్లీషు, హిందీల్లో  ఒకటికి పదిసార్లు వందరకాలుగా అక్కడి మేనేజర్‌కు మొరపెట్టుకున్నా. ‘‘అటువంటి సమాచారమేదీ మా దగ్గర లేదు. చెప్పగలిగిన వారూ లేరు’’.. అని అంతే స్పష్టంగా ప్రకటించి..నా ఉత్సాహం మీద నీళ్ళుకుమ్మరించేసాడు.

  తరువాత కలుగుల్లో ఎలుకలా దూరి వెతికితే ఆ మేనేజరు నిస్సహాయతకు జవాబు దొరకడమే కాదు, ఆ సంస్థ, ఆ వ్యవస్థ వెనుక ఉన్న ఉన్నతాశయాలు, సమున్నత భావాలు ఒక్కొక్కటిగా తెలిసాయి... అవే ఇవి)

(గీతా ప్రెస్ పరిణామక్రమం వివరించే పుస్తకం ఒకటి ఉందని తెలిసింది. అయితే దానిని గీతా ప్రెస్ ప్రచురించలేదు. వారికి వారి ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదు. ఎవరో అభిమాన ప్రచురణకర్త దీనిని ప్రచురించారట. ఆ ప్రచురణకర్త చిరునామా దొరకడం లేదు)

 

ఆ గీత... భగవత్ +  గీత

ఆ సమున్నతాశయాలు ఆవిష్కరించే ముందు- గీతా ప్రెస్ హ్రస్వ రూపం, విశ్వ స్వరూపం రెండూ క్లుప్తంగా చూద్దాం. మార్చి, 2024 వరకు అందిన గణాంకాల ప్రకారం గీతా ప్రెస్ ఇప్పటివరకు 94.78  కోట్ల పుస్తకాలను (మాసపత్రిక కాపీలతో సహా) అమ్మింది. దీనిలో 16.21 కోట్లు భగవద్గీత కాపీలుకాగా, 11.73 కోట్లు గోస్వామి తులసీదాస్ (రామచరిత మానస్ రచయిత) రచనలు. 11కోట్ల పుస్తకాలు పిల్లలకు నైతిక విలువలు బోధించేవి. ఇవన్నీ సంస్కృతంతో సహా14 భాషల్లో ప్రచురించారు. హిందూ మత గ్రంథాల ప్రచురణ సంస్థల్లో ప్రపంచంలో ఇదే అతి పెద్దది.

కరోనా మహమ్మారి ప్రపంచ మార్కెట్లను కుదిపేసినా, సోషల్ మీడియా కచ్చకొద్దీ సంప్రదాయ మాధ్యమాల మార్కెట్లను తొక్కేస్తున్నా, జిఎస్‌టీలు, నోట్ల రద్దు వంటివి స్టాక్ ఎక్ఛేంజీల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నా.... గీతా ప్రెస్ గ్రాఫ్ నిబ్బరంగా అలా పైపైకి పోవడం అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసింది.  అమ్మకాలు 2016లో-రు.39కోట్లు, 17లో రు.47 కోట్లు, 18లో రు.66కోట్లు, 19లో రు.69 కోట్లు, 2021లో రు.78 కోట్లు. ఇక వీరు ప్రచురించే కళ్యాణ్ మాస పత్రిక ప్రస్తుతం 1.6 లక్షల కాపీలు ముద్రిస్తున్నారు.  దీనికి 21 హోల్‌సేల్ దుకాణాలున్నా, చిల్లర దుకాణాలు ఐదుకు మించి లేవు.  43 రైల్వే స్టేషన్లలో మాత్రం స్టాల్స్ ఉన్నాయి.

ఇంత తక్కువ నెట్‌వర్క్ తో అంతటి అఖండ విజయానికి కారణం – ఇది లాభాపేక్షలేని ధార్మిక సంస్థ. కాగితం, ముద్రణ వ్యయం ఎంత ఎక్కువగా ఉన్నా... దానిలోని విలువైన సనాతన ధర్మ సమాచారం అందరికీ చేరవేయడానికి పుస్తకాలను చాలా చౌకగా అమ్ముతారు. ఇక సేల్స్ ప్రమోషన్, మార్కెటింగ్ వ్యూహాలు, పబ్లిసిటీ బడ్జెట్లు ఏవీ ఉండవు. నోటి ప్రచారం మీదే ఆధారపడతారు(అంటే ఒకటి కొని నచ్చినవారు మరికొంతమందికి చెప్పడం ద్వారా జరిగే ప్రచారం). వారి పాలసీ ప్రకారం అడ్వర్టయిజ్మెంట్లు తీసుకోరు, వేసుకోరు. విరాళాలకు కూడా ఆమడ దూరం. ఇతరుల నుంచి ఏ రూపంలో కూడా ఆర్థిక సహాయం తీసుకోరు. మరి అలా చేస్తే నష్టాలు రావా ??? .... రాక ఎక్కడికి పోతాయి !!!  మరి ఆ లోటు భర్తీ ఎలా అవుతుంది ? అంటే వీరు నిర్వహించే ఇతర వ్యాపారాల లాభాలను దీనికి మళ్ళిస్తారు. ఇంతకూ ఆ వ్యాపారాలేమిటో తెలుసా !!! గీతా వస్త్ర విభాగ్ ద్వారా చేనేత వస్త్రాల వ్యాపారం, గీతా ఆయుర్వేద ద్వారా ఆయుర్వేద మందుల అమ్మకాల్లో వచ్చిన లాభాలే ఆ లోటు పూడుస్తున్నాయి.

వస్త్ర వ్యాపారి, ఆధ్యాత్మికచింతనా పరుడు కీ.శే. జయాదయాళ్‌జీ గోయెం‌ద్‌కా  1923లో కలకత్తాలో ‘గోవింద్ భవన్ కార్యాలయ’ పేరిట ఒక ధార్మిక ట్రస్టు ఏర్పాటు చేసి హిందూ మతానికి సంబంధించిన పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు.. మరీ ముఖ్యంగా భగవద్గీతను ఇంటింటికీ చేర్చాలన్న తపనతో ప్రచురణలు మొదలుపెట్టారు. రు.600లు పెట్టి ఒక ముద్రణా యంత్రాన్ని కొని ప్రెస్ ప్రారంభించారు. అయితే ఆశించినంత ఆదరణ రాకపోవడంతో  గోరఖ్‌పూర్‌లో 1927లో రు.10ల అద్దెకు ఒక ఇల్లు తీసుకుని ప్రెస్‌ను అక్కడికి మార్చారు. తరువాత భాయీజీగా అందరికీ తెలిసిన మరో సాహితీవేత్త హనుమాన్ ప్రసాద్‌జీ పోద్దార్ కళ్యాణ్ పత్రికకు శాశ్వత సంపాదకుడిగా చేరారు.

వీరి సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2021 సంవత్సరానికి  ‘గాంధీ శాంతి బహుమతి’కి గీతా ప్రెస్‌ను ఎంపిక చేసింది. అయితే అవార్డు అందుకుంటాంగానీ దానితోపాటూ వచ్చే కోటి రూపాయల నగదు బహుమతి తీసుకోవడానికి మాత్రం ససేమిరా అన్నారు. కారణం – విరాళాలు ముట్టకూడదనేది వారి విధానం కనుక.

ఉదయం 9గంటలకు ప్రెస్ తెరుస్తారని తెలిసి ఆ సమయానికి చేరుకున్న మమ్మల్ని అక్కడి దృశ్యం మరింత ఆకర్షించింది. కార్మికులు, ఉద్యోగులు ఓ 15 నిమిషాలు చెప్పులొదిలేసి నిష్టతో ప్రార్థనలు చేసిన తరువాత వారివారి పనుల్లో దూరారు. వందేళ్ళు దాటినా.. గీతా ప్రెస్, అధునాతన సాంకేతికతను ఒడిసి పట్టుకుంటూ దాని లక్ష్యాలను సులభంగా (ఆర్థిక ఇబ్బందులనుగురించి ఆలోచించకుండా) సాధిస్తున్నది. దీని వెబ్‌సైట్ ద్వారా వీరి ప్రచురణలు కొనవచ్చు. కొన్ని రకాల పుస్తకాలు ఉచితంగా చదువుకోవచ్చు. మరికొన్ని ఉచితంగా వినవచ్చు. ఇ-బుక్స్ ద్వారా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి బహుళ జాతీయ మార్కెటింగ్ (ఆన్‌లైన్) వ్యవస్థల ద్వారా ప్రపంచంలోని హిందువులకు మత గ్రంథాలను (క్లాసిక్స్ తో సహా) అన్ని భారతీయ భాషల్లో, అతి తక్కువ ధరల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం వీరి వద్ద అమూల్యమైన 3500  రాతప్రతులు, వంద భగవద్గీత భాష్యాలున్నాయి.

(గీతా ప్రెస్ ఆర్థిక సమస్యలతో మూతపడిందనే ఒక వార్త సామాజికమాథ్యమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. ఈ విషయాన్ని మేనేజర్ దగ్గర ప్రస్తావిస్తే... 2000వ సంవత్సరంలో కార్మికులు జీతాలు పెంచమని డిమాండ్ చేస్తూ సమ్మె చేసారు. అప్పుడు 11రోజులు మూతపడింది. ఆ సమస్య అప్పుడే పరిష్కారమయింది. ఆ తరువాత నుంచి ఇప్పటివరకు ఏ సమస్యా లేదు. ప్రెస్ సజావుగా నడుస్తున్నది ..అని వివరించారు.)

లీలా చిత్రమందిర్

గీతాప్రెస్ పై అంతస్థులోని పెద్ద హాలులో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేసారు. కంటికి పండగే. ఇది మిస్ కాకూడదు. భగవద్గీతలోని ప్రతి శ్లోకానికి ఒక తైలవర్ణ చిత్రం. రామ, కృష్ణుల లీలావిలాసాలను తెలిపే 684 చిత్రాలు. ... అన్నీ  ప్రముఖ చిత్రకారులవే. అవి ఎంతగా జీవం పోసుకున్నాయంటే... ప్రతి చిత్రం దగ్గర కొన్ని నిమిషాలు ఆగిచూస్తుంటే... మిగిలినవి మిస్ అవుతామేమోనన్న ఆత్రుతలో అయిష్టంగానే ముందుకు కదలక తప్పని పరిస్థితిలో ఉంచుతాయవి.

.......................


ప్రెస్ ముఖద్వారం చూడండి....ప్రఖ్యాత ప్రాచీన దేవాలయాలు గుర్తొచ్చే విధంగా తీర్చిదిద్దారు. ముందు కనిపించే స్తంభాలు ఎల్లోరాను, కృష్ణార్జునుల రథం ఉన్న వృత్తం అజంతా గుహలను, పైన శిఖరం దక్షిణ భారతదేశంలోని మీనాక్షీ దేవాలయ గోపురాన్ని గుర్తుకు తెస్తాయి.

లీలా చిత్రమందిర్ (దీనిలో గీతా ప్రెస్ తొలి ముద్రణా యంత్రాన్ని కూడ చూడవచ్చు)

 ..............

నా కాశీ యాత్ర - (ప్రయాగ రాజ్‌లో...రాజకీయం)

https://rajabhayya.blogspot.com/2025/04/1.html?spref=tw

 నా కాశీ యాత్ర-(వారణాశిలో.. అయోమయం)

https://rajabhayya.blogspot.com/2025/04/2.html?spref=tw

 నా కాశీ యాత్ర-(అయోధ్యలో... అపచారం)

https://rajabhayya.blogspot.com/2025/04/3.html?spref=tw

 నా కాశీ యాత్ర-(స్మశాన భస్మంతో కాశీలో  హోళీ...)

https://rajabhayya.blogspot.com/2025/04/4.html?spref=tw

 నా కాశీ యాత్ర-5 (గోరఖ్‌పూర్)

https://rajabhayya.blogspot.com/2025/04/5.html?spref=tw

నా కాశీ యాత్ర-7(ధన్యవాదాలు) 

https://rajabhayya.blogspot.com/2025/04/7.html?spref=tw

...................

నా కాశీ యాత్ర-5 (గోరఖ్‌పూర్-నాథ్ సంప్రదాయం)

 

(గోరఖ్‌పూర్-యోగ విద్యా కేంద్రం)

(ప్రయాగరాజ్, వారణాశి, అయోధ్యలతరువాత గోరఖ్‌పూర్ చేరుకున్నాం. అయోధ్యకు 135 కి.మీ దూరంలో ఉంది. ఈ టూర్‌లో నేను ఎక్కువ ఆశలు పెట్టుకున్నది ఈ ఊరిమీదే. అందుకే రెండురోజులు ఉండేటట్లు ప్లాన్ చేసుకున్నా. 

లోగడ కావలికి చెందిన శ్రీరామదూత స్వామి వారి శిష్యులు వారి మాసపత్రిక ‘వందేహం రామదూతం’ ప్రత్యేక సంచిక ప్రచురణలో నా సహాయ సహకారాలు కోరినప్పుడు వృత్తి బాధ్యతగా ఆసక్తి పెంచుకుని కష్టపడి కొంత సమాచారాన్ని సేకరించి ‘మనకు దూరంగా బతుకుతున్న మన దగ్గరి బంధువులు’ పేరిట యోగులు, అవధూతలు, సిద్ధులకు సంబంధించి ఒక వ్యాసాన్ని కూడా అందించాను. (లింకు కింద ఉంది). దానిలో గోరఖ్‌పూర్ ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తుంది. 

ఆ ఉద్దేశంతో నేరుగా వెడితే ఈ సబ్జెక్టుమీద చాలా సమాచారం దొరుకుతుందని ఆశపడితే ...బాగా నిరాశ పరిచారు అక్కడి బాధ్యులు. లైబ్రరీకి పంపారు. అక్కడ కేవలం అక్షరాలా నాలుగే నాలుగు పుస్తకాలు, వాటిలో మూడు హిందీలో,  ఒకటి(ఫిలాసఫీ ఆఫ్ గోరఖ్‌నాథ్) ఇంగ్లీషులో ఉంటే దానిని మాత్రం కొన్నా. అది సిద్దాంతాన్ని చర్చించిందే కానీ సామాన్య జనాలకు కావలసిన సమాచారమేదీ అందులో లేదు. అక్కడి లైబ్రేరియన్‌గా ఉన్న వ్యక్తిని అడిగితే... మా వెబ్‌సైట్ లో ఆన్‌లైన్ లైబ్రరీ ఉంది. దానిలో అన్నీ ఉంటాయి-అన్నాడు.  ఆ లింకు ఇప్పటికీ తెరుచుకోలేదు. అమెజాన్‌లో కూడా వెతుక్కోమన్నాడు. 

తెలుగునాట ...విద్యానాథ్, గోపీనాథ్, ద్వారకానాథ్, శ్రీనాథ్... ఇలా నాథ్ లు చాలా మంది కనిపిస్తారు. వీరు నాథ్ సంప్రదాయానికి చెందినవారా..ఏమో వారికే తెలియదు. నా స్నేహితుల్లో ఒకరిద్దరు మాత్రం వారి తల్లిదండ్రులు  గోరఖ్‌పూర్ వెళ్ళివస్తుండేవారని చెప్పారు. వీరికి ఆ సాంప్రదాయానికి సంబంధం ఉందా లేక కేదార్‌నాథ్, బదరీనా‌థ్ వంటి   క్షేత్రాల పేర్లు, దేవుళ్ళ పేర్లుగా భావించి  బాగుందని పెట్టుకున్నారా... నాకైతే తెలియదు. అనుభవజ్ఞులు కానీ పండితులు కానీ చెప్పాలి. ఆ దృష్ట్యా నేను సేకరించిన సమాచారాన్ని కొంత విపులంగా ఇస్తున్నా....)

గోరఖ్‌పూర్‌ - ఐరావతీ నదీ(రాప్తీ)తీర పట్టణం.  ఇక్కడ గోరఖ్‌నాథ్ ఆలయంతో సంబంధమున్న  మఠాలు, ఆలయాలు., సంస్కృత విద్యా పీఠంతో సహా పలు విద్యాసంస్థలు, ఆస్పత్రులు, గోశాలలు, యాగశాలలు మొత్తం 52 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. చాలా మటుకు విద్య, వైద్యం ఉచితం. అన్న ప్రసాద వితరణ కూడా మధ్యాహ్నం, రాత్రి ఉంటుంది. కులం, వర్గం, ధనిక, పేద అనే తేడా లేకుండా ...మనోవాంఛలతో, ముఖ్యంగా సంతాన యోగం కోసంఉత్తర భారతం నుండి నేపాల్ నుండి కూడా హిందూ భక్తులు పెద్దఎత్తున ఇక్కడికి వస్తుంటారు. వివాహ నిశ్చితార్థాలు కూడా భక్తులు ఇక్కడే చేసుకోవడానికి ఇష్టపడతారట. పిల్లల తలనీలాలు కూడా సమర్పించుకుంటారు. టూరిస్టుబస్సుల్లో వచ్చి ఇక్కడే వండుకుని, స్నానశాలల్లో స్నానాదికాలు ముగించుకుని, కఠోరమైన ఉపవాసాలతో ఆలయ దర్శనం చేసుకుంటారు. ఆలయ పరిసరాల్లో మాత్రం చాలా హోటళ్ళు... ప్యూర్ వెజిటేరియన్..అన్న బోర్డులు పెట్టుకుని... ఉల్లిపాయ, ఎల్లిపాయ(వెల్లుల్లి)లు కూడా లేకుండా భోజన ఏర్పాట్లు చేస్తుంటాయి.

శివుడు యోగస్వరూపునిగా కనిపించే గోరక్షానాథ్ మందిరంలో అత్యంత నియమనిష్ఠలతో పూజాదికాలు నిర్వహిస్తుంటారు. అఖండ జ్యోతి, అఖండ ధునా ఉన్నాయి అర్థరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకల్లా మహంతుల ప్రతినిథులుగా పూజార్లు  శుచీ శుభ్రతలతో  ఆ ప్రాంగణంలోని గురువుల విగ్రహాలతోపాటూ...అన్ని ప్రతిష్ఠిత దేవతామూర్తుల(లోపల దుర్గా మందిర్, హనుమాన్‌జీ మందిర్ వంటివికూడా ఉన్నాయి) పూజలకు సిద్ధంగా ఉంటారు. వేకువఝూమున 3 గంటలకు ముందే నిర్మాల్యం తొలగించడం వంటివన్నీ పూర్తి చేసుకుంటారు. అక్కడినుంచి ఉషోదయం వరకు శ్రీనాథ్ కు, ఇతర దేవీదేవతలకు అభిషేకాలు, హారతులు, ఘంటలు-డమరుకనాదాలతో మంత్రాలు సుస్వరంతో పలుకుతూ పూజలు చేస్తారు. గోరఖ్‌పూర్‌లో ఈ పూజలు ముగిసే సమయానికి ఈ మందిరాలతో సంబంధమున్న  తులసీపూర్‌(ముజఫర్ నగర్) దేవీపాటన్ మందిర్లో పూజలు ప్రారంభమవుతాయి. అవి ముగిసే సమయానికి దాంజ్ఞ్ లో(నేపాల్) పూజలు మొదలవుతాయి. అంటే ఈ మూడుచోట్ల 24 గంటలు నిర్విరామంగా  పూజాదికాలు జరుగుతూనే ఉంటాయి.

గోరఖ్‌పూర్‌లో పూర్వోత్తర్ రైల్వే(ఈశాన్య రైల్వే) ప్రధాన కార్యాలయం ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకూ బస్సు సౌకర్యం ఉంది. విమానాశ్రయం ఉంది.  గోరఖ్‌పూర్ నుంచి  60 కి.మీలలో కుశీనగర్ వస్తుంది. ఇది బుద్ధుడి మహాపరినిర్వాణ ప్రదేశం. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు పవిత్రంగా భావించే నాలుగు ప్రదేశాల్లో ఇది ఒకటి.మిగిలిన మూడు లుంబిని(జన్మస్థలం), బుద్ధగయ(జ్ఞానోదయం అయిన ప్రదేశం), సారనాథ్(కాశీ దగ్గర...మొదటి ప్రవచనం ఇచ్చిన ప్రదేశం). గోరఖ్‌పూర్ నుంచి మరో దిశలో 90 కి.మీలలో  నేపాల్ (అంతర్జాతీయ) సరిహద్దు పట్టణం సునౌలీ వస్తుంది.. నేపాలీయులు దీన్ని బేలాహియా అంటారు. గోరఖ్‌పూర్ నుంచి లుంబినీ ప్రాంతానికి రోడ్డు మార్గంలో 2గంటల్లో చేరుకోవచ్చు. నేపాల్‌లో ప్రవేశించడానికి వీసా అక్కర్లేదు గానీ పాస్‌పోర్టు తప్పనిసరి.

చరిత్ర

క్రీ.పూ. 6వ  శతాబ్దంనాటి మగధ సామ్రాజ్యంలోని 16 మహాజనపదాల్లో గోరఖ్‌పూర్ ఒకటి. తరువాత  వచ్చిన మౌర్య, శృంగ, కుషాణ్, గుప్త, హర్ష సామ్రాజ్యాల్లో కూడా ఇది ఒక భాగంగా ఉంది. గోరఖ్‌పూర్ జనపదంలోకి ప్రస్తుతం ఉన్న మహరాజ్‌గంజ్, కుశీ నగర్, దేవరియా, అజంగఢ్, మావు, బల్లియా, నేపాల్ తెరాయ్ లోని కొన్ని భాగాలు వస్తాయి.

గోరఖ్‌నాథ్ 11వ శతాబ్దానికి చెందిన వాడని ఒక వాదన కాగా త్రేతాయుగంలో తపస్సు చేసుకున్నట్లు ఆధారాలున్నాయని వారి ప్రచారసామాగ్రిలో ఉంది. దీని ప్రకారం ... సామ్రాట్ అశోక్, కనిష్కుడు, హర్షుడికాలాల్లో దేశ ప్రతిష్ఠ ఎలా ప్రపంచవ్యాప్తమయిందో అలాగే విక్రమ శకం 8వ శతాబ్దానికి ముందే నాథ్ పంథా(సంప్రదాయం) ద్వారా యోగ ను అనేకులు సాధన చేసేవారట. మహమ్మద్ ఖిల్జీ, తరువాత ఔరంగజేబు వంటి వారు గోరఖ్‌పూర్‌ ఆలయాలను ధ్వంసం చేసారనీ... విక్రమ శకం 19వ శతాబ్దంలో మహంతుల నుంచి ప్రస్తుత యోగి ఆదిత్యనాథ్ (ముఖ్యమంత్రి) వరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టి జీర్ణోద్ధరణ అద్భుతంగా చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని వారి అధికారిక సమాచారం. 2014లో తన గురువు అవైద్యనాథ్ మరణం తరువాత యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ మఠానికి మహంత్(ప్రధాన పూజారి)గా ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు.

నాథ్ సంప్రదాయం

గోరఖ్ నాథ్ ప్రవేశ పెట్టిన నాథ్ సంప్రదాయంలో నాథ్ ఒక యోగి. దర్శనీయోగి లేదా కన్‌ఫట్ యోగి అనే పేర్లతో వ్యవహరిస్తారు.  యోగి లక్ష్యం – నాథ్ లేదా స్వామి కావడం.. ప్రకృతిని జయించినప్పుడే అది సాధ్యం అవుతుంది. అలా కావాలంటే... నైతికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా క్రమశిక్షణతో జీవితం గడపాలి. అన్ని విషయాల్లో నియంత్రణ సాధించాలి. అంటే అన్ని సిద్ధులను బాహ్యంగా, ఆంతరంగికంగా, అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు భవ బంధాలు, కష్టసుఖాలకు అతీతంగా ఉండగలుగుతాడు.

ఈ సంప్రదాయంలోని యోగులు, సిద్ధులు అడుగుపెట్టని చోటు భారతదేశంలోనే లేదు.. 15వశతాబ్దంనాటి హఠయోగ ప్రదీపిక, 17వ శతాబ్దం నాటి శివసంహిత, ఇదేకాలానికి చెందిన ఘేరండ సంహితలు హఠ యోగాన్ని లేదా హఠవిద్యను విపులంగా తెలియచేసాయి. గోరక్షానాథ్‌ రాసిన గోరక్ష సంహితనుకూడా కొందరు పండితులు ఈజాబితాలో చేర్చారు.

దీనికి కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఎవరూ చూడకుండా, వినకుండా ఉండడానికి శివుడు ఒక ఒంటరి దీవిని ఎంచుకుని హఠయోగ రహస్యాలను పార్వతీదేవికి ఏకాంతంలో బోధిస్తాడు. అయితే ఇదంతా ఒక చేప నిశ్చలచిత్తంతో విని సిద్ధపురుషునిగా మారుతుంది. ఆయనే మత్స్యేంద్ర నాథుడు. ఆయన తన శిష్యుడు గోరక్షానాథ్‌కు, చౌరంగి అనే మరొక కాళ్ళూచేతులూ లేని వ్యక్తికి బోధిస్తాడు. ఇక ఆ తరువాత గురుశిష్యపరంపరలో చాలామంది హఠ యోగులు దీనికి విస్తృత ప్రచారం కల్పించారు. అయితే దీనికి అధిక ప్రజాదరణ కల్పించిన ఘనత మాత్రం గోరక్షానాథ్‌దే. ఆయన దీని మీద చాలా గ్రంథాలు రాశారు. అవి..గోరక్ష సంహిత, సిద్ధ సిద్ధాంత పద్ధతి, గోరక్షాటక, యోగ మార్తాండ, యోగ చింతామణి. వీటిలో సంస్కృతంలో వెలువడిన సిద్ధసిద్ధాంత పద్ధతి గ్రంథంలో అవధూతఅంశానికి సంబంధించి చాలా సమాచారం ఉందట.

హఠయోగ సంహిత, ఘేరండ సంహితల్లో 35మంది అద్భుత హఠయోగసిద్ధుల ప్రస్తావన ఉంది. వారిలో ఆదినాథ్‌, మత్య్సేంద్రనాథ్‌, గోరక్షానాథ్‌ ఉన్నారు. అంతేకాక షట్కర్మ, ఆసన, చక్ర, కుండలిని, బంధ, క్రియ, శక్తి, నాడి, ముద్రలతోపాటూ ఇతర అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఉంది. అవధూత పంథాలో నాథ్‌ సంప్రదాయం ఉంది. అవధూతగీతదీనిని విపులంగా చర్చించింది.  గోరక్షానాథ్‌, మచ్ఛేంద్రనాథ్‌ లను టిబెట్‌ బౌద్ధగ్రంథాలు మహాసిద్ధులుగా, అనంత శక్తిమంతులుగా కీర్తించాయి.

నాథ్‌లలో ఆదినాథ్‌ అంటే మహాశివుడు. మహాదేవుడే తొలి నాథ్‌. నవనాథ్‌లు గురుపరంపరలో తొమ్మిదిమంది. దత్తాత్రేయ మహర్షితో ఈ సంప్రదాయం మొదలవుతుంది. 1.మత్స్యేంద్రనాథ్‌ 2. గోరక్షానాథ్‌ (గోరఖ్‌ నాథ్‌) 3. జలంధర్‌ నాథ్‌ (జన్‌ పీర్‌) 4. కనీఫ్‌ నాథ్‌ 5. గెహనీ నాథ్‌ (గైబీ పీర్‌) 6.భార్తరీ నాథ్‌ (రాజా భార్తరీ) 7. రేవణా నాథ్‌ 8. చార్‌పతినాథ్‌ 9. నాగ్‌ నాథ్‌ (నాగేష్‌ నాథ్‌). వీరిని నవ నారాయణులని కూడా అంటారు. ప్రాపంచిక కార్యకలాపాల పర్యవేక్షణకు శ్రీకృష్ణుడు నవ నారాయణులను పిలిచి వారితో నాథ్‌ సంప్రదాయాన్ని ప్రారంభింపచేసాడని మరొక కథనం.

నాథ్‌ సంప్రదాయం..గురుశిష్య పరంపరానుగతంగా కొనసాగుతుంది. గురువు నుండి దీక్ష తీసుకున్ననాటి నుంచే ఈ సంప్రదాయంలో చేరినట్లు లెక్క. గురువు శిష్యుడి శరీరాన్ని తాకి తన ఆధ్యాత్మిక శక్తిలో కొంత భాగాన్ని మంత్ర సహితంగా ధారపోస్తాడు.తద్వారా కొత్తగా నాథ్‌ అయిన శిష్యుడికి కొత్తపేరు పెడతారు. ఈ ప్రక్రియలో గురుశిష్యులు దిగంబరులుగానే ఉంటారు. ఒకసారి దీక్ష తీసుకున్న తర్వాత జీవితాంతం అతను నాథుడే.దాన్ని స్వయంగా వదిలించు కోలేరు. వేరొకరికి అప్పగించడంకూడా కుదరదు.

నాథ్‌ సంప్రదాయాన్ని కూడా 12 పంథాలుగా విభజించారు. 1. సత్య నాథ 2. ధరమ్‌నాథ 3. దారియానాథ 4. ఆయినాథ 5. వైరాగ కీయా 6. రామాకే 7.కపిలాని 8. గంగానాథీ 9. మన్నాథీ 10. రావల్‌కే 11.పావాపంథ్‌ 12.పాగ్‌లా పంథీ. మరో వర్గీకరణ ప్రకారం మచ్ఛీంద్రనాథ్‌, ఆదినాథ్‌, మీనా నాథ్‌, గోరఖ్‌నాథ్‌, ఖపర్‌నాథ్‌, సత్‌నాథ్‌, బాలక్‌నాథ్‌, గోలక్‌ నాథ్‌, విరూపాక్ష్‌నాథ్‌, భర్తృహరినాథ్‌, ఐనాథ్‌, ఖేచార్‌నాథ్‌, రామచంద్రనాథ్‌ అని ఉంది.

యోగవిద్య 

‘‘అణుయుగంలో యోగవిద్య(ముఖ్యంగా క్రియాయోగం) గురువు మార్గదర్శకత్వంలో సాధన చేయ వలసిందే తప్ప అచ్చులో వచ్చింది చదువుకుని సరిగా అధ్యయనం చేసి ఫలితాలు సాధించడానికి వీలుకాదు’’ అంటాడు పరమహంస యోగానంద తన ‘ఒక యోగి ఆత్మకథ’ పుస్తకంలో.





మనకు దూరంగా బతుకుతున్న మన దగ్గరి చుట్టాలు(సిద్ధులు, అవధూతలు, నాగసాధువులు...)

https://rajabhayya.blogspot.com/2025/01/blog-post.html?spref=tw

........... 

నా కాశీ యాత్ర - 1 (ప్రయాగ రాజ్‌లో...రాజకీయం)

https://rajabhayya.blogspot.com/2025/04/1.html?spref=tw

 నా కాశీ యాత్ర-2 (వారణాశిలో.. అయోమయం)

https://rajabhayya.blogspot.com/2025/04/2.html?spref=tw

 నా కాశీ యాత్ర-3 (అయోధ్యలో... అపచారం)

https://rajabhayya.blogspot.com/2025/04/3.html?spref=tw

 నా కాశీ యాత్ర-4 (స్మశాన భస్మంతో కాశీలో  హోళీ...)

https://rajabhayya.blogspot.com/2025/04/4.html?spref=tw

 నా కాశీ యాత్ర-6  (గీతా ప్రెస్-గోరఖ్‌పూర్)

https://rajabhayya.blogspot.com/2025/04/6.html?spref=tw

నా కాశీ యాత్ర-7(ధన్యవాదాలు) 

https://rajabhayya.blogspot.com/2025/04/7.html?spref=tw

...................

నా కాశీ యాత్ర-4

 


మా వియ్యంకులది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని  అయోధ్య పొరుగు జిల్లా. వారు హైదరాబాదులో మా ఇంటికి వచ్చినప్పుడు కోస్తా మీదుగా తిరుపతి యాత్ర చేసాం. దానికి కృతజ్ఞతగా వారు మమ్మలి వారింటికి రమ్మనమని, వస్తే వారికి బాగా దగ్గరగా ఉండే కాశీ, అయోధ్య చూపుతామని చాలా సార్లు పిలిచినా కుదర్లేదు. చివరకు మార్చి 5న రథం కదిలింది. మొదటగా ప్రయాగ రాజ్, తరువాత వరుసగా వారణాశి, సారనాథ్, అయోధ్య, గోరఖ్‌పూర్, కుశీ నగర్‌లను చూసొచ్చాం. మధ్యలో వచ్చిన హోళీ పండగ వియ్యంకుల ఊళ్ళోనే జరుపుకున్నాం. ఉత్తర ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాన్ని చూసే అవకాశం లభించింది. అయితే ఆదరాబాదరాగా కాకుండా నింపాదిగా 16 రోజులు అన్నీ తిరిగొచ్చాం.

మా యాత్రా విశేషాలతో మిమ్మల్ని విసిగించే ప్రయత్నం కాదిది. మీకు ఇవి కొట్టిన పిండే. 

ఒక జర్నలిస్టుగా నా పరిశీలనలో నాకు కొత్తగా, విశేషంగా అనిపించినవి కొన్నయితే, కొన్ని భ్రమలు తొలగించేవి కాగా, మరికొన్ని రాజకీయంగా, సామాజికంగా ప్రతి ఒక్కరూ ఆలోచించడానికి పురిగొల్పేవి.. 

అయితే ఇది కూడా సాధ్యమయినంత క్లుప్తంగానే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా.....  వారి హోళీ పండుగ

 

4. హోళీ ఉత్తర భారతంలో భిన్నంగా.. కాశీలో విభిన్నంగా

హైదరాబాదులో, తెలంగాణలో హోళీ ఆడతాం, పండుగ జరుపుకుంటాం.అయితే ఎక్కడో అంతరాంతరాల్లో ఇది మన పండుగకాదు, ఉత్తరాదివారిదన్న భావన కదులుతుంటుంది. అక్కడి వారు చెప్పిన దానిని బట్టి మనం జరుపుకునే హోళీపై ..రాజస్థానీయుల, అంటే మార్వాడీల ప్రభావం ఎక్కువ-అని.

వసంతరుతువు రాకకు సూచనగా దేశంలోని చాలా ప్రాంతాల్లో  పవిత్రంగా హోళీ పండుగను జరుపుకుంటారు. ఒక్క ఉత్తర ప్రదేశ్ లోనే అయోధ్య పరిసరాల్లో ఒకలాగా, మధురలో ఒక లాగా, వారణాశిలో మరో రకంగా జరుపుకుంటారు. మధురలో రాధాకృష్ణుల ప్రేమను తెలుపుతూ ఫిబ్రవరిలో వచ్చే వసంత పంచమినుండి హోళీ పున్నమ్ వరకు హోళీ కేళి జరుపుకుంటారట.. చాలా హృద్యంగా ఉంటుందట.

మేం జరుపుకున్న ఊళ్లో అయితే...ఇంచుమించు ఆ ప్రాంతమంతా... హోళీ ముందు రోజు అర్థరాత్రి...హోళికా దహనం ఉంటుంది. అక్కడికి ఆడవారు పోరట. పొద్దున్నే మగవాళ్లు వెళ్ళి అక్కడ భస్మాన్ని నుదుటిపై పులుముకొని దగ్గర్లో ఉన్నఆలయాలకు వెళ్ళి అక్కడి దేవతా మూర్తులకు కూడా పులిమి... కొంత ఇంటికి తెచ్చి ఆడవారికిస్తారు. వారు దానికి గులాల్ కలిపి పూజా మందిరంలో చల్లుతారు. ఆ తరువాతే ఒకరికి మరొకరు గులాల్ పూసుకుంటూ సంబరాలు మొదలవుతాయి. దీనిని ఛోటీ హోళీ అని రంగ్ వాలీ హోళీ అని కూడా అంటారు.

ఆ సాయంత్రం.. ఇక్కడ తెలంగాణలో దసరా నాడు  బంధుమిత్రులను  కలిసి వెండిబంగారం (జమ్మి ఆకు) ఇచ్చిపుచ్చుకున్నట్లుగానే... అక్కడ అందరూ ఒకరింటికి మరొకరు పోయి కలిసి మిఠాయిలు పంచుకుంటారు. వీటిలో హోళీ సందర్భంగా తప్పనిసరిగా చేసే స్వీటు గుజియాలు (కజ్జికాయలు).

దక్షిణాదిన కామదహనం జరుపుకుంటాం. శివుడు మూడో కన్ను తెరవడంతో కాముడు భస్మమవుతాడు. అలాగే ఉత్తర ప్రదేశ్‌లో... హోళికను దహనం చేస్తారు. హోళిక హిరణ్యకశిపుడి సోదరి.  అన్న ఆజ్ఞ మేరకు ప్రహ్లాదుడిని చంపడానికి ఆ బాలుడిని ఒళ్లో పెట్టుకుని అగ్నిప్రవేశం చేస్తుంది. అగ్ని వల్ల ఎటువంటి హాని కలగకుండా వరం పొందానన్న ధీమాతో దూకుతుంది. కానీ అగ్నిదేవుడు  ఆ రక్షణ కవచాన్ని ఆమెకు ఉపసంహరించి, ప్రహ్లాదుడికి ఇవ్వడంతో... ఆమె అగ్నికి ఆహుతవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. ఇది చెడుపై మంచి సాధించిన విజయంగా హోళికా దహనం  జరుపుకుంటారు.

కాశీలో మశానా హోళీ...

కాశీలో ఫాల్గుణ శుక్ల ఏకాదశినాడు మొదలవుతుంది. దీనిని రంగ్ భరీ ఏకాదశి అని కూడా అంటారు. మణికర్ణికా ఘాట్ దగ్గరలోని కీనారామ్ ఆశ్రమం/మహాశంశాన్  నాథ్ మందిర్ లో మహా హారతి ఇచ్చిన తరవాత అక్కడి నుండి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.  ‘ఖేల్ మశానే మేఁ హోళీ దిగంబర్’ అన్న నినాదాలు మారుమోగుతుండగా... పుర్రెలు, కపాల మాలలు ధరించిన నాగసాధువులు, అఘోరాలు ఒళ్ళంతా చితి భస్మాన్ని పులుముకుంటూ వెదజల్లుకుంటూ పెద్ద ఊరేగింపుగా బయల్దేరతారు. ఈఏడాది మార్చి 11న ఇది జరగగా దాదాపు 5 లక్షలమంది భక్తులు పాల్గొన్నారు.

వివాహానంతరం మహా శివుడు పార్వతిని  మొదటిసారి రంగ్ భరీ ఏకాదశి నాడు తన ఇంటికి... కాశీకి కాపురానికి తీసుకువస్తాడు. దీనిని గౌనా అంటారు. అంటే పునఃసమాగమం. ఆ ఆనందంలో శివుడు  నాట్యం చేస్తాడు. ఆ మరునాడు భూతగణాలకోసం శివుడు మణికర్ణికా ఘాట్‌కు పులిచర్మం, కపాలమాలలను ధరించి వచ్చి చితాభస్మాన్ని పులుముకుని వాళ్ళతో కలిసి నృత్యం చేస్తాడని బాబా మహా శంషాన్ మందిరం మేనేజర్ గుల్షన్ కపూర్ చెప్పాడు.  ఈ సంబురాలు హరిశ్చంద్రఘాట్ దగ్గర ముగుస్తాయి.( ఈ రెండు ఘాట్‌ల వద్ద నిత్యం పచ్చి శవాల దహనం జరుగుతూనే ఉంటుందట. ఇప్పటివరకు అలా జరగని రోజులేదంటారు స్థానికులు)

దీనినే అక్కడ మశాన్ హోళీ అని, భభూత్ హోళీ అని కూడా అంటారు. ఇది కేవలం కాశీకే పరిమితం. మరో కథనం ప్రకారం యమ ధర్మరాజును ఓడించిన దానికి గుర్తుగా దీనిని జరుపుకుంటారని అంటారు. చావును ఆనందంగా ఆహ్వానించే ప్రదేశమని కాశీని మోక్షపురం అని కూడా పిలుస్తారట.

.............

    ‘‘ ఒక నదికి గానీ , ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో   దీనిని ‘ ప...