How poor is poor in India ?

 


మన పేదలు ఎంత పేదరికంలో ఉన్నారు ???

(ఇది మరీ డ్రై సబ్జెక్ట్ అని బెదరకండి. చివరివరకూ చదవండి. ఆసక్తికర సమాచారం)

మనిషి మారిపోతున్నాడు. వేషం మారుతున్నది, భాష మారుతున్నది, ఆహారవిహారపుటలవాట్లు మారిపోతున్నాయి. మొత్తంగా జీవన శైలి... వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా..అన్నిటికీ మించి ఆర్థికంగా మారిపోతున్నది. అది కూడా మునుపటిలాగా నత్తనడకతోకాదు, బ్రహ్మోస్ క్షిపణిలాగా ఊహకందని వేగంతో...

 ఈ మార్పు మీకూ నాకూ అందరికీ కనిపిస్తున్నది... 

కనిపించనిది మన ప్రభుత్వాలకు, మన ప్రజా ప్రతినిధులకు, మన రాజకీయ పార్టీలకు... ఒకవేళ కనిపించినా సవ్యదిశలో కాకుండా అపసవ్య దిశలో కనిపిస్తున్నది...

...అని ఎలా చెప్పగలం???


       పేదలు అంటే ఎవరు? మధ్యతరగతి అంటే ఎవరు? 

          ఈ ప్రశ్నలకు ప్రభుత్వాలవద్ద నిర్వచనాలుంటాయి. వాటితో అధికారిక (సర్వే) గణాంకాలు కూడా ప్రకటిస్తారు.  అవే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రతిఫలిస్తుంటాయి...

పేదలు : అంతర్జాతీయ నిర్వచనం ప్రకారం ... పేదరికం అంటే- కనీస అవసరాలతో జరుగుబాటుకు తోడ్పడే ఆస్తిపాస్తులు కానీ, ఆదాయం కానీ లేకపోవడం. కటిక పేదరికం అంటే – తిండి, బట్ట, గూడువంటి కనీస వ్యక్తిగత అవసరాలు తీరే దారికూడా లేకపోవడం. ఈ నిర్వచనం దేశాన్నిబట్టి, మన దేశంలో కూడా రాష్ట్రాన్నిబట్టి మారుతున్నా, సారాంశం ఇంచుమించు ఇదే.

24 ఫిబ్రవరి, 2024న గణాంకాల మంత్రిత్వశాఖ ప్రచురించిన ‘నెలసరి ఇంటి ఖర్చు’ సర్వే ప్రకారం .. ఈ కొలమానం గ్రామాల్లో నెలకు రు.1441, పట్టణాల్లో రు2,087గా ఉంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం – భారతదేశంలో కటిక పేదరికం 2011లో 22.5 % ఉండగా, 2019 నాటికి 10.2% కు తగ్గింది.  దీని నివేదిక ప్రకారం 2024లో కటిక పేదరికంతో మగ్గుతున్న వారు 12 కోట్ల 90 లక్షల మంది  ఉన్నారు.(రోజుకు రు.181ల కంటే తక్కువ సంపాదనతో బతుకుతున్నవారు). ఈ సంఖ్య 1990లో 43కోట్ల10లక్షలుగా ఉంది. 

(ఎంత తగ్గిందో గమనించండి.)

మధ్యతరగతి : ప్రస్తుతం రు.5-30 లక్షల మధ్య వార్షిక ఆదాయం ఉన్నవారు మధ్యతరగతి వారట. రు.30 లక్షల వార్షిక ఆదాయం అంటే నెలకు రు.2.5 లక్షలు. మరి ఈ కుటుంబం మధ్య తరగతి కిందకు వస్తుందా ? రు.5 లక్షల కనీస ఆదాయం అంటే నెలకు రు. 40 వేల  ఆదాయం వారు కూడా మధ్యతరగతి అనేది వారి లెక్క. ఇక అగ్రకులాల్లో ఆర్థిక వెనుకబాటు వర్గం(ఇడబ్యుఎస్) నిర్ధారణ కు కొలత... వార్షిక ఆదాయం రు.9 లక్షలు..అని నిర్ణయించారు.

పై లెక్కల్లో పొంతన ఎక్కడయినా ఉందేమో జాగ్రత్తగా చూడండి!!!

ఇక అసలు విషయానికొద్దాం.....

వ్యవస్థీకృత రంగంలో పన్ను వసూళ్ళు నిక్కచ్చిగా ఉంటాయి. జీతగాళ్ళనుంచి కూడా ముక్కుపిండి ఠంఛనుగా వసూలు చేస్తారు. అంతవరకూ బాగానే ఉంది.

మరి అవ్యవస్థిత రంగం మాటేమిటి ?

ఈ రంగంలో ... లెక్కకు రాని, లెక్క చూపని లావాదేవీలు అంటే   వీథి వ్యాపారాలు, చిట్టీలు, కూరగాయలు, పళ్ళు, టిఫిన్ బండ్లవంటివాటి ద్వారా జరిగేవి చాలా ఉంటాయి... నిజానికి వ్యవస్థీకృతం రంగం కంటే ఇది ఎన్నో రెట్లు పెద్దది. ఇక్కడ ఆదాయవ్యయాలు కాకుల లెక్కలే. 

హైదరాబాదు బస్తీల్లో వారంలో ఒక రోజు కూరగాయల సంత ఉంటుంది. ఒక బండి నడిపే వ్యాపారి పక్కన అతని భార్యది మరో బండి. వీరిద్దరూ ఆ ఒక్క రోజు మధ్యాహ్నం 3 గంటలనుంచి రాత్రి 9 గంటల లోపల రు.35‌-40 వేల వ్యాపారం(లాభం కాదు, టర్నోవర్) చేస్తారు. ఒక చిన్న గల్లీలో ఒక వ్యాపారి/ఉద్యోగి పార్ట్ టైంగా 10, 12 క్రేట్ల పాలు అమ్మడం ద్వారా నెలకు రు.9 లక్షల టర్నోవరు చేస్తాడు.(వీటిలో వారి లాభం అంతా మీరే సులభంగా లెక్కగట్టవచ్చు).  సక్రమంగా నెలంతా ఒక క్యాబ్ స్వతంత్రంగా నడిపే  డ్రైవరు నెలకు.రు50వేల పైనే సంపాదిస్తాడు.  ఇదంతా వీరి నుండి సేకరించిన సమాచారమే. వీరి కుటుంబాల్లో మరీ చిన్న పిల్లలు తప్ప దాదాపు అందరూ సంపాదనాపరులే. 

మంచి సెంటరులో టిఫిన్ బండి(ఇదీ పరిమిత సమయంలో) నడిపే వాడు కేవలం దోసె మాస్టర్‌కు ఇచ్చే జీతం నెలకు రు.30వేల పైమాటే. జూబిలీ హిల్స్ లో నెలకు లక్షల్లో కిరాయి కట్టి నడిపే ఒక రెస్టారెంట్ యజమాని - ఎదురుగా ఉండే గల్లీలో ఒక టిఫిన్ బండి ప్రారంభమైన  అతి కొద్ది నెలల్లోనే తన దుకాణం మూసేయక తప్పని పరిస్థితి. ఆ సమయంలో  కాకతాళీయంగా  ఒక పత్రికావిలేకరి న్యూస్ స్టోరీ చేస్తూ దాని యజమానిని కలిస్తే... ‘‘మాకు పన్నులు, కిరాయిలు, కరెంటు బిల్లులు, పోలీసుల మామూళ్ళు, రాజకీయ పార్టీలవారికి చందాలు, పార్కింగ్ లేదని ఛలాన్లు,  లేబర్ చట్టాలు అన్నీ ఉంటాయి. ఫుట్ పాత్ మీద వ్యాపారం చేసేవారికివేవీ ఉండవు కదా... అంటూ నేను కూడా ఇదే వ్యాపారంలో కొనసాగితే బండి నడుపుకోవడమే బెటర్ ...’’ అంటూ వాపోయాడు. కోఠీ సుల్తాన్ బజార్లో... వీథుల్లో దుకాణాలముందు కనిపించే బండ్లన్నీ... ఆయా దుకాణాల తాలూకు యజమానులవే అన్న సంగతి తెలిస్తే ఆశ్చర్యపోతారు.

సాధారణంగా ఈ చిరువ్యాపారుల్లో దాదాపు ప్రతి కుటుంబానికీ వారి ఊర్లో స్వంతంగా ఒక ఇల్లో, కొద్దిపాటి పొలమో తప్పనిసరిగా ఉంటుంది.  వీరి  (కొద్దిమందయినా) పిల్లలను ప్రైవేటు స్కూళ్ళల్లో డొనేషన్లు కట్టి చదివిస్తుంటారు. ( మా ఇంట్లో రు.2700లకు పనిచేసే లంబాడీ వర్కర్ తన ముగ్గురు పిల్లలను ప్రైవేటు స్కూళ్ళల్లో చదివిస్తూ....  ఈ మధ్యనే  ఒక్కొక్కరికి రు.20/30 వేల చొప్పున దళారీలకు డబ్బులిచ్చి ఇద్దరు పిల్లలను గురుకులాల్లో చేర్పించింది. భర్త ఆటో డ్రయివర్. మరో రెండు ఆటోలున్నాయి. కిరాయికిస్తాడు. ఊళ్ళో పొలం ఉంది. ఇల్లుంది). మురికివాడల్లో కనిపించే ఇళ్ళల్లో ప్రతి ఇంటికీ కేబుల్ కనెక్షన్ తో టీవీ ఉంటుంది. ఇది పైకి కనిపించేదే. వీరికి స్వంత వ్యాపారాలు, వాహనాలు (టూవీలర్లు), స్మార్ట్ ఫోన్లు ఉంటాయి.. వీరందరూ ప్రభుత్వ లెక్కల్లో పేదలే. ఉచిత పథకాలకు అర్హులే.

వీరు పేదలయినప్పుడు కటిక పేదలు, నిరుపేదలు, నికృష్ట పేదలను కూడా వీరితో సమానంగా లెక్కగట్టడమేనా! అట్టడుగువర్గాల రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ అని ఒకటుందిగా, అమలయినా కాకపోయినా... అటువంటిదేదో ఇక్కడ కూడా ఉండాలిగా వడబోతకు. ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి అంటున్నప్పుడు...ఎగువ పేదలు, దిగువ పేదలు, సంపన్న పేదలంటూ ఏదో రకమైన నిర్వచనం ఇవ్వాలిగా. ఇదే అడిగితే.. వారి ‘ఆదాయ పరిమితి’ లెక్కలు చూస్తాంగా అంటారు అధికారులు. మరి వ్యక్తుల, కుటుంబాల ఆదాయ వ్యయాలు నిక్కచ్చిగా తేల్చడానికి సమాజంలో  ఇన్ని దశాబ్దాలుగా వస్తున్న మార్పులకు వీరు అనుసరిస్తున్న కొలమానాలు ఏమిటి ? చేస్తున్న సమీక్షలు,  సవరణలు ఏమిటి ?

ఓ చిన్న ప్రహసనం లాంటి ఉదాహరణ : రేషన్ కార్డుల మీద దొడ్డుబియ్యం ఇస్తున్నప్పుడు ... వీరిలో చాలా మంది తీసుకోలేదు. తీసుకున్నవారిలో దాదాపు అందరూ బయట కిలో రు.10-15లకు  అమ్ముకున్నట్లు ప్రభుత్వమే బహిరంగంగా అంగీకరిస్తున్నది కదా... అంటే (వారందరి జీవన ప్రమాణాలు  మెరుగయ్యాయి కాబట్టి) సన్నబియ్యం ఇచ్చేవరకూ వారు బహిరంగ మార్కెట్లో రు.50లకో, 60లకో  కొనుక్కుని పూట గడిపినట్టే కదా !

పేదల పథకాల్లోని వైరుధ్యానికి, విలక్షణతకు ఒక  ఉదాహరణ :

‘‘బహిరంగ మార్కెట్లో బియ్యం కిలో రు.6-7లు ఉన్నప్పుడు రు.2/- లకే ఇస్తే ప్రజలు ఎన్టీఆర్ కు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు బియ్యం కిలో.50-60లు ఉన్నా అదే రు.2లు లేదా రు.1కి ఇవ్వడమా !!!’’అని రాష్ట్రంలో క్యాబినెట్ హోదాలో ఉన్న ఒక మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ఇటీవల బహిరంగంగా వాపోయినా .... ఇప్పటివరకు దానిమీద సమాజంలో ఏ వర్గం నుండికానీ, ఏ రాజకీయ పార్టీనుండి కానీ, నాయకుడినుండి కానీ, ఏ ఆర్థిక నిపుణుడి నుండి కానీ, ఏ మీడియా సంస్థనుండి కానీ, ఏ స్వతంత్ర విలేకరినుండి కానీ స్పందన నామ మాత్రంగా కూడా లేదు.

అదే సమయంలో... ‘‘మా పార్టీని తీసుకెళ్ళి ఫలానా పార్టీలో కలిపే ప్రయత్నం జరుగుతున్నది’’ అని ఒక నాయకురాలు అన్న మరుక్షణం నుంచీ ఇప్పటివరకు రాజకీయపార్టీలు, నాయకులు, మీడియా సంస్థలు, సామాన్య పౌరులు...ఇలా అందరినోటా రోజూ ఇదే చర్చ, రచ్చయి ఆగకుండా నడుస్తున్నది....

అంటే ఈ పరిణామం దేనికి సంకేతం ???

కాళ్ళూ చేతులు చచ్చుబడిన ఒక సమాజంలో

మన ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టంగా చూపుతున్న దృశ్యం ఇది.

ఇదంతా చదివి నేను పేదల నోరు కొట్టే ప్రయత్నాలు చేస్తున్నా అనుకోకండి తొందరపడి...

ఒకానొక సమయంలో – జనాలను మాయలతో ముంచెత్తే రాజకీయం ఒంటబట్టక ముందు... 1980ల్లో –అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అమాయకంగా... ఓ రహస్యం బయటపెట్టాడు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో ప్రతి రూపాయికి  15 పైసలమేర మాత్రమే లబ్దిదారులకు అందుతున్నదని కుండబద్దలుగొట్టారు. దొంగకు తేలు కుట్టినట్లు .. దేశంలోని అధికారపార్టీలు కక్కలేక, మింగలేక విలవిల్లాడినా... దానిని అంగీకరించక తప్పలేదు.

మరో ఉదాహరణ : ఏళ్ళ తరబడి ఒక కుటుంబం రేషన్ కార్డు ఉపయోగిస్తున్నది లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్నది.. ఇన్ని దశాబ్దాలుగా ఆ కుటుంబం ఆర్థికంగా ఏమాత్రం ఎదుగూబొదుగూ లేకుండానే ఉందా ?...ఔను అనుకుంటే... పేదరికాన్ని తగ్గించామని ప్రగల్భాలు పలికే ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందయినా ఉండాలి లేదా ఆ కుటుంబం అయినా ప్రభుత్వాన్ని మోసగిస్తూ లబ్దిపొందుతూ ఉండాలి.. అంతేగా !!!

అందుకే మనం మన ప్రభుత్వాలను, మన రాజకీయ నాయకులను తెలిసితెలిసీ గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నిస్తూ పోవాలి...

మనకు ప్రశ్నించడం చేతకాదని మాత్రం అనకండి. ప్రశ్నించడంలో మన సామర్ధ్యం ఎంత వీరత్వంతో, ఎంత అరివీరభయంకరంగా  ఉంటుందో ఫేస్ బుక్కుల్లో, వాట్సాప్పుల్లో మన అకౌంట్లు చూస్తే తెలుస్తుంది. మన గాండ్రింపులు ఇక్కడే కాదు,  సామాజిక మాథ్యమాలు దాటి ఇంటి గడపదాటి బయట కూడా ప్రదర్శించగలగాలి. లేకపోతే పులుల జాతి అంతరించిపోయిందని.. ఇప్పుడున్న వి కాగితపు పులులేనని అటవీశాఖ వారిచేత మానవ వనరుల శాఖ వారు అధికారికంగా ప్రకటింప చేస్తారు.

-ములుగు రాజేశ్వర రావు


గమనిక : నేనూ మీ లాగే సాధారణ పౌరుడిని. ఆర్థిక వ్యవహారాల నిపుణిడిని కాను. కానీ వంకాయ కూరలో ఉప్పూకారాలు సరిగా ఉన్నాయోలేదో చెప్పడానికి  మనం పాకశాస్త్ర ప్రవీణులం(చెయ్యితిరిగిన వంటవాళ్ళం) కానవసరం లేదు కదా... అందుకే పూనుకున్నా.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

    ‘‘ ఒక నదికి గానీ , ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో   దీనిని ‘ ప...