ఓట్ల దొంగతనమా ! ! ! - 1

 

ఓట్ల దొంగతనమా ! ! !  - 1

ఇప్పుడు దేశమంతటా ఓట్ల దొంగతనం మీద చర్చ రాజుకున్నది... ఇంకా కొంతకాలం ఈ మంటలు చెలరేగుతుంటాయి... ఇప్పుడే మొదలయింది కాబట్టి... దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం తెలుసుకుని ఉంటే... ఆ చర్చమీద మనకు ఒక అవగాహన ఏర్పడి ఉంటే... మనం కూడా సరైన వాదనలు వినిపించవచ్చు... అటు కానీ .. ఇటు కానీ...

నేను 2018లో, 2023లో జరిగిన ఎన్నికల సమయంలో...  భారత ఎన్నికల సంఘం తాలూకు రాష్ట్ర కార్యాలయంలో మీడియా విభాగంలో పనిచేసా...  దానికి ముందు- జర్నలిజానికి తోడు, ఎన్నికల సంఘం తాలూకు  పుస్తకాలను తెలుగులోకి అనువదించిన అనుభవం ఉంది. మరీ లోతుగా కాకపోయినా,  నా అవగాహన మేరకు నేను తెలుసుకున్న విషయాలను ఇక్కడ మీ ముందుంచుతున్నా... సమగ్రంగా ఒకే వ్యాసంగా అయితే పెద్దదయి  మీకు చదవడం ఇబ్బంది. కాబట్టి... చిన్నచిన్నవిగా వీలయినన్ని ఇస్తూ పోతా... వాటిలో ఓటరు జాబితా వంటి అంశాలే  కాకుండా, ఇవిఎంల ద్వారా ఓటింగ్ జరిగేటప్పుడు దొంగ ఓట్లు ఎలా పడే అవకాశం ఉంది ? అధికార పార్టీతో ఎన్నికల కమిషన్‌కు ఉండే అక్రమ, సక్రమ సంబంధాలు, ఎన్నికల కమిషన్ లో జరిగే అవినీతి కథలు... ఇలా చాలా చెప్పాలనుకుంటున్నా... అదీ నాకు తెలిసినంత వరకు...

నేను మిస్సయిన సమాచారం మీరూ తెలుపవచ్చు... నా తప్పులేవయినా ఉంటే సరిదిద్దవచ్చు... అంతే తప్ప... దీనిలో అర్థంపర్థంలేని వితండ వాదనలు, ఏదో ఒక పార్టీని నెత్తినెత్తుకుని అవాకులు చెవాకులు పేలడాలూ వంటివి మాత్రం చేయకండి...

 

పాత చింతకాయ పచ్చడి :

ఆగస్టు 7, 2025న ‘ఓట్ల దొంగతనం’ అంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు కొత్తవేం కాదు. ఎప్పటినుంచో ఉన్నాయి.. ప్రతి ఎన్నికలో... ఇవి అందరికీ అనుభవైకవేద్యమే...చాలా మంది బాధితులు కూడా. అసెంబ్లీ ఎన్నికలో ఉపయోగించుకున్న  ఓటు, మరో కొద్దినెలల్లోనే జరిగిన పార్లమెంటు  ఎన్నికలకు మాయమయి పోవడాలు, చచ్చిన వాళ్ళు బతికినట్లు, బతికిన వాళ్ళవి చచ్చిన(డిలీట్) జాబితాలో చోటు చేసుకోవడాలూ, ఒక వ్యక్తికి చాలా చోట్ల ఓట్లు ఉండడాలు, ఒక కుటుంబంలో అందరికీ ఓటర్ కార్డులున్నా...  పోలింగ్ సమయంలో కొందరివి గల్లంతు కావడాలు, ఒకే ఇంటి నంబరుతో చాలా ఓట్లు, ఓటరు కార్డుమీద ఇతరుల ఫొటోలు... ఇలా...

రాహుల్ గాంధీ చేసిన 5 ఆరోపణలు కూడా ఇవే. డూప్లికేట్ ఓట్లు, నకిలీ లేదా దొంగ చిరునామాలు, ఒకే ఇంటి నంబరు మీద చాలా ఓట్లు(50, 100, 150..) ఉండడం, తప్పుడు ఫొటోలు, ఫారం-6 దుర్వినియోగం.  తన ఆరోపణలకు బలం చేకూర్చడానికి ఒక నియోజకవర్గాన్ని శాంపుల్ గా తీసుకుని శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిర్ధారించుకున్న సాక్ష్యాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. బెంబేలెత్తిన ఎన్నికల సంఘం... ఒక స్వతంత్ర, రాజ్యాంగ వ్యవస్థగా దాని మీద ఆరోపణలు, అనుమానాలు వస్తున్నప్పుడు..ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం... ఫిర్యాదులను వాటి ఫార్మాట్ లలో ఇవ్వాలని  రాహుల్ గాంధీని పదేపదే డిమాండ్ చేయకుండా,  తప్పయితే జైలుశిక్ష ఉంటుందనీ హెచ్చరించకుండా... వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే  హుందాగా ఉంటుంది. ఇదే ఫిర్యాదు ప్రధానో లేక ఏ కేంద్రమంత్రో, ఏ అధికార పార్టీ ప్రతినిధో  చేస్తే అప్పుడు కూడా ఎన్నికల సంఘం ఇలానే అంటుందా ?...

2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తన నియోజకవర్గంలో 15 వేల ఓట్లు గల్లంతయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఐలాపూర్ గ్రామంలో 950 ఓట్లుంటే, ఓటర్ల జాబితాలో అవి1650 ఓట్లకు  ఎలా పెరిగాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అప్పుడే ఫిర్యాదు చేసాననీ, ఇప్పటి సిఇఓకు కూడా కంప్లయింట్  చేసానని బిజెపి పార్లమెంటు సభ్యుడు ఎం.రఘునందన్ రావు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం చివరి దశలో ... కొత్త రాష్ట్రం ఆవిర్భావ సమయంలో ఎన్నికలకు ముందు...  ఆంధ్రావాళ్ళ ఓట్లు, సమైక్యవాదులుగా గుర్తించిన తెలంగాణావాసుల ఓట్లు ... ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున గల్లంతయినట్లు అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఇక మర్రి శశిధర్ రెడ్డి అయితే ఓటర్ల జాబితామీద చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రతిసారీ చాలా ఫిర్యాదులు చేస్తుంటారు.

 

ఈ ఓట్ల దొంగతనం నిజమేనా !!!

నిజమే అయితే ఎందుకు జరుగు తున్నది ?

ఎలా జరుగుతున్నది !!!


ఓటర్ల జాబితాలో అవకతవకలను ప్రధానంగా రెండు తరగతులుగా విభజింవచ్చు

1.     కాకతాళీయంగా లేదా నిర్లక్ష్యంతో జరిగేవి

2.     ఉద్దేశ పూర్వకంగా జరిగేవి.

రెండోదే ఎక్కువ అభ్యంతరకరం, నేరం కూడా. అయినా దాని బీజాలు మొదటి దానిలో ఉంటాయి. అందువల్ల దానిని క్లుప్తంగా చూద్దాం...


ఓటర్ల జాబితా : ఇదే తొలి దశ. ఎన్నికలకు ఇదే కీలక, మౌలిక డాక్యుమెంట్. కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి జరిపే ప్రతి ఎన్నికకూ ఇదే ఆధారం.  ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తమ తరఫున ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుని  పంపాలంటే... ఈ జాబితా ఆధారం మీదే మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా ఆధారపడి ఉంది... అటువంటి ఆధారశిల మాత్రం- అట్టడుగున పనిచేసే బిఎల్‌ఓ స్థాయినుండి కేంద్ర ఎన్నికల సంఘంలోని ఉన్నత స్థాయి అధికారి వరకు నిర్లక్ష్యానికి గురవుతుంటుంది. ఎన్నికల ప్రక్రియ మొదలయిన దగ్గరి నుండీ అందరూ దీనిని గురించే మాట్లాడుతుంటారు...అంతే తప్ప దాని కచ్చితత్వాన్ని గురించి పట్టించుకోరు....

సాంకేతికంగా మనం ఎంత అభివృద్ధి చెందామో చూపడానికి...  ఆధార్ కార్డ్, మొబైల్ బ్యాంకింగే సాక్ష్యం. అయినా  ఓటర్ల జాబితా రూపకల్పన  పద్ధతి70 ఏళ్ళ కింద ఎలా ఉందో ఇప్పటికీ  దాదాపు అలాగే ఉంది.            ‘మీ ఓటు మీ హక్కు’ అంటూ ఊదరగొట్టడానికి... కోట్ల రూపాయలు రకరకాల ప్రచారం మీద, కొత్త కొత్త యాప్ ల మీద ఎన్నికల సంఘం ఖర్చు పెడుతుంది తప్ప ఎన్నికలు త్వరలో లేదా ఐదేళ్ళకు ఒకసారి రావడం ఖాయం అని తెలిసినా... చివరి నిమిషం వరకూ ఓటరు జాబితా ప్రక్షాళన గురించి పట్టించుకోరు. (చేర్పులు, మార్పుల గురించి మాట్లాడడం లేదు. జాబితాలో వివరాలు వాస్తవాలేనా, ఏదయినా తప్పు సమాచారం ఉందా...వంటివి)

ఎన్నికల సంఘంలో అత్యంత తక్కువ స్థాయి అధికారి బిఎల్ ఓ (బూత్ లెవల్ ఆఫీసర్). ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో గరిష్ఠంగా 1500 ఓట్లుంటాయి.  ఆ పరిధిలో పనిచేసే బిఎల్ ఓ స్వయంగా ఇంటింటికీ వెళ్ళి కొత్త ఓటర్ల నమోదు, అప్పటికే ఉన్న ఓటర్ల సమాచారం స్వయంగా పరిశీలించి వాస్తవాలతో నివేదికలు పంపితే...  పైన సూపర్‌వైజర్, ఎఇఆర్ఓ, ఇఆర్‌ఓ, డిఇఓల తనిఖీలన్నీ పూర్తి చేసుకుని తుది జాబితా  రాష్ట్ర సిఇఓకు చేరుకుంటుంది.

అయితే అస్త్యవస్తాలకు బీజాలు బిఎల్‌ఓ స్థాయిలోనే పడతాయి. స్వయంగా గడపగడపకూ పోరు,  పోయినట్లు రికార్డులు చూపుతారు. చాలా చోట్ల ఔట్ సోర్సింగ్ సిబ్బందిని లేదా తాత్కాలికంగా అందుబాటులో ఉండే వారిని పంపి మమ అనిపిస్తారు.  ఒక కుటుంబంలో వీరు వెళ్ళినప్పుడు ఒకరో ఇద్దరో ఉంటారు... మిగతా వారి గురించి ఆ కుటుంబ సభ్యులు ఏది చెబితే అది రాసుకుపోతారు. వెరిఫై చేసుకోరు.  ఇంట్లో ఆ సమయంలో లేని వారి లేదా ఇతర దేశాల్లో సెటిలయిన వారి వివరాల గురించి  రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేదా ఇతరత్రా డాక్యుమెంట్లు అడిగి తెప్పించుకుని తనిఖీ చేయవచ్చు. అవి చేయరు. ఆ ఇంటి నంబరు మీద నమోదయిన ఓటర్లలో -చనిపోయినవారు, ఇల్లు మారినవారు, నకిలీ ఓటర్ల  వాస్తవ సమాచారాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోరు. (ఫిర్యాదులు అందినప్పుడుకూడా పైనుంచి కింది దాకా అందరూ బిఎల్‌ఓ నే అడుగుతారు. అతను ఎంత చెబితే అంత... సిఇఓ కు నేరుగా ఫిర్యాదులు అంది గొడవ జరిగేటట్లుంది అన్నప్పుడు పైఅధికారులు స్వయంగా వెళ్లి చూసి నివేదికలు పంపుతారు. ఎన్నికల సమయంలో అధికార పక్షం వారు తప్ప, సెలబ్రిటీలు తప్ప మరే నాయకుడు ఫిర్యాదు చేసినా అందరూ తేలిగ్గా తీసుకుంటారు. (మీ ఓటు చెక్ చేసుకోండి అంటూ ఇంకా చాలా హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఇచ్చినా అవి కంటితుడుపే).

-ములుగు రాజేశ్వర రావు

 

(ఉద్దేశపూర్వకంగా ఓట్ల దొంగతనం ఎలా జరుగుతుందో తదుపరి వ్యాసంలో చూద్దాం)


భారత ఎన్నికల సంఘం ప్రధాన నినాదం ఏమిటంటే....

“No Voter to be left behind”

అర్హుడైన ఏ ఒక్క పౌరుడూ తన ఓటు హక్కు కోల్పోవకూడదు’’

భారత పౌరుడయి ఉండి, 18 ఏళ్ళు నిండి సదరు పోలింగ్ కేంద్రం పరిధిలోశాశ్వతంగా లేదా తాత్కాలికంగా నివాసం ఉంటున్న వారు ఓటరుగా నమోదుకు అర్హులు.. అన్నది మౌలిక సూత్రం.

ఆచరణలో ఇది ఎంత ఉదాత్తంగా ఉంటుందో చూడాలంటే...

ఇల్లే ఉండాల్సిన అవసరం లేదు, ఫుట్‌పాత్‌ల మీద, షెడ్లలో ఉంటూ జీవనం గడుపుతున్న వారు కూడా నివాసంతాలూకు రుజువు లేకపోయినా  ఓటరు జాబితాలో చేర్చడానికి అర్హులే. వారున్న ప్రాంతాన్ని బిఎల్‌ఓ సందర్శించి (రెండు మూడు సార్లు) వారు అక్కడే ఉంటున్నట్లు నిర్ధారిస్తే చాలు.. అలా ఫారం – 6 ద్వారా వారిని ఓటరుజాబితాలో చేరుస్తారు.

 క్రమం తప్పకుండా నిద్రకు  బసకు వచ్చిపోయేవారు కూడా అర్హులే... వారు అక్కడే ఉండి వంట చేసుకుంటున్నట్లు లేదా  తింటున్నట్లు కూడా రుజువులు పనిలేదు. మధ్య మధ్యలో అక్కడ నిద్రించకపోయినా... ఆ వ్యక్తి సదరు ప్రదేశంలోనే ఎక్కువ సార్లు నిద్రిస్తున్నాడని రూఢి అయితే చాలు... వారూ అర్హులే.

నివాస ధృవీకరణ లేకపోయినా సెక్స్ వర్కర్లు కూడా అర్హులే... బిఎల్‌ఓ వ్యక్తిగతంగా సందర్శించి నిర్ధారిస్తే చాలు. వారూ ఓటర్లవుతారు.



 

గుడిని నమ్ముతాం.. మరి పార్లమెంటునో !!!

 

S-400 Game Changer

 

వార్త: ఆపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్ కు చెందిన ఆరు విమానాలను ధ్వంసం చేసాం-అని మన ఎయిర్ ఛీప్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ బెంగళూర్ లో శనివారం(ఆగస్టు 9న) ప్రకటిస్తూ...దాని తాలూకు శాటిలైట్ ఛాయా చిత్రాలను ప్రదర్శించారు. ఈ ఆపరేషన్ లో పాకిస్థాన్ కు జరిగిన నష్టంపై భారత్ సైనికాధికారి బహిరంగంగా ప్రకటన చేయడం ఇదే మొదటిసారి.

* * *

కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి.. అంటూ ఆపరేషన్ సిందూర్ ను అర్థంతరంగా ఆపివేసిన తరువాత ... చాలా అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం అయిన నేపథ్యంలో పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పరచి దీనిపై దేశ ప్రజలకు పూర్తిగా వివరణ ఇవ్వాలని  ప్రతిపక్షాలు కోరాయి. అయితే ప్రత్యేకంగా సమావేశపరచలేదు కానీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా  దీనిపై రెండు రోజుల చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. అప్పటిదాకా ప్రభుత్వం బయట చెబుతూ వచ్చినవే సభలో కూడా చెప్పిందితప్ప అదనంగా మరే సమాచారం ఇవ్వలేదు, అనుమానాలు తీర్చలేదు. సభలో చర్చ ముగిసింది....

ఇప్పుడు..ఉన్నట్టుండి  అత్యున్నత సైనిక అధికారి ఎయిర్ ఛీప్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్  కొత్త విషయం ప్రకటించారు. మున్ముందు ఇంకా ఎవరు ఎప్పుడు కొత్త విషయాలు ప్రకటిస్తారో తెలియని పరిస్థితిలో... ఒక మౌలికమైన ప్రశ్న

పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్న సందర్భంలోనే అత్యున్నత సైనికాధికారి సభ వెలుపల ఒక ప్రకటన చేసి..అది కూడా ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడించకుండా దాచిన విషయాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రభుత్వం ఈ విషయాన్ని ఇప్పటివరకు సభ ముందుంచనప్పుడు ఇది పార్లమెంటును అవమానించడం కాదా..??? ఔననే ఎందుకు అనుకోవాల్సింది వస్తుందంటే...

 

సర్వోన్నత సభ !!!

మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. పార్లమెంటు సర్వోన్నత  చట్ట సభ. జాతీయ ప్రాముఖ్యం ఉన్న విషయాలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను ఈ సభలో ప్రజా ప్రతినిధులు పరిశీలించి, చర్చించి నిర్ణయిస్తారు. వాటినే ప్రభుత్వం అమలు చేస్తుంది. ముందు కాకపోయినా తరువాత అయినా ప్రభుత్వం సభ ముందుంచి ఆమోదం తీసుకుంటుంది.   ప్రభుత్వం అధికారం అనుభవిస్తున్నా... అలా పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది. అలా ఉండి తీరాలి. ఈ సభల్లో దాపరికం ఉండకూడదు. (కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప... అదిక్కడ మనకు ప్రస్తుత చర్చనీయాంశంలో వర్తించదు). ప్రత్యక్ష ప్రసారాల ద్వారా, పత్రికా విలేకరుల ద్వారా  ఈ సభల సమాచారం అంతా ప్రజలకు చేరుతుంటుంది. 

మరటువంటప్పుడు జాతీయ భద్రతకు  సంబంధించి  ఒక సీనియర్ సైనికాధికారి బయట చెప్పిన ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు సభలో చెప్పకుండా దాచింది.... 

అంటే ప్రభుత్వం పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోవడం లేదని భావించాల్సి వస్తుంది కదా...!!!.

అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఇది వాంఛనీయం కాదు...ఇవ్వాళ అధికారపక్షం రేపు ప్రతిపక్షం అయినప్పుడు... వారికి ఇలా ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుందా !!!  50ఏళ్ళ నాటి ఎమర్జన్సీని  ఇప్పుడు కూడా తిట్టగలిగేంత నైతికత, ఉన్నత విలువలు తమకు ఉన్నాయని ప్రకటించుకుంటున్నప్పుడు... జరుగుతున్నదేమిటి ???

ఆపరేషన్ సిందూర్ పై కొన్ని అనుమానాలు చూద్దాం...

1.     మన దెబ్బకు తట్టుకోలేక పాకిస్థాన్ కాళ్ళబేరానికి వచ్చింది, కాల్పుల విరమణ ప్రతిపాదన అదే చేసింది. మనం అంగీకరించాం. అంతవరకు ఓకే... మరి మనం పాకిస్థాన్ కేమయినా  షరతులు విధించామా ? ఒకవేళ విధిస్తే ఆ షరతులుఏమిటి ?

2.     ఏ షరతులు లేకుండానే మనం అకస్మాత్తుగా కాల్పుల విరమణ పాటించేసామా ...?

3.      ఒకవేళ అదే నిజమయితే ఎవరి ఒత్తిడికి తలఒగ్గి అలా అంగీకరించాం ..???

4.     భారత్-పాక్ వ్యవహారాల్లో మూడో దేశం మధ్యవర్తిత్వం వహించకూడదనేది మనం నిక్కచ్చిగా పాటిస్తున్న విధానం... మరి కాల్పుల విరమణ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు మొదట ఎలా ప్రకటించారు ? అది కూడా ... తన ప్రభావం/ప్రమేయంతోనే, వాణిజ్య  సంబంధాల బూచితో సాధ్యమయిందని ఎలా ప్రకటించారు ? ఒకసారి కాదు.. ఇప్పటికీ అలా ప్రకటిస్తూ పోతున్నా... నేరుగా ఆయన ప్రకటనలను ప్రభుత్వం ఎందుకు ఖండించి వాటిని నిలుపుదల చేయించడం లేదు ?

5.     ఒకవేళ పాకిస్థాన్ తో మనకు అవగాహన లేదా అంగీకారం కుదిరి ఉంటే ... మనకు కలిగిన ప్రయోజనం (లాభం)ఏమిటి ?

(మళ్ళీ మనవైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయకుండా చావుదెబ్బ తీసాం.. అని మనం పదేపదే ప్రకటిస్తున్నప్పుడు... ఇంకా సీమాంతర ఉగ్రవాదం ఎలా కొనసాగుతున్నది ? పాకిస్థాన్ కూడా మునుపటిలాగానే ప్రేలాపనలు ఎలా చేయగలుగుతున్నది ?)

6.     రాజకీయంగా మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టే మేం అతి తక్కువ కాలంలో శత్రువుని కాళ్ళబేరానికి తీసుకురాగలిగాం..అని సైనిక దళాలు ప్రకటిస్తున్నాయి.. అది ప్రశంసనీయం. మరి అంతటి ఘన విజయాన్ని వారు బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చినప్పుడు... శత్రువు అడిగీ అడగక ముందే ఎటువంటి లాభసాటి షరతులతో ఒప్పందం చేసుకోకుండానే  సైనికదళాల చర్యలను ఎందుకు ఆపేసారు ? ఇక్కడ రాజకీయం ఎలా చొరబడింది ?


ఈ అనుమానాలన్నింటినీ తీర్చాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వం పై ఉంటుంది.

 ప్రభుత్వం ప్రజల ముందు ఉంచని ముఖ్యమైన సమాచారాన్ని  సంబంధిత అధికారులు

ఎక్కడో కాకతాళీయంగా బయటపెడుతున్నప్పుడు...

దానిని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ?

 

ఆధ్యాత్మికంగా మందిరాన్ని నమ్మినప్పుడు

రాజకీయంగా పార్లమెంటును  కూడా నమ్మాలి కదా !!!

 

-ములుగు రాజేశ్వర రావు

........

 (అధికార పార్టీ భక్తులు జుట్టు పీక్కోకండి... 

నేనిక్కడ ప్రస్తావిస్తున్నది నైతిక, సాంకేతిక అంశాలను మాత్రమే...

దీనిని రాజకీయం చేయకండి... ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇది వర్తిస్తుంది.)


నా వేలు నీ కంట్లో... నీ వేలు నా నోట్లో...

 


కర్ణాటకలో 2024లో జరిగిన సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలో ఉద్దేశపూర్వకంగా అక్రమాలు జరిగినట్లు తమ సర్వేలో తేలిందని కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై – భారత ఎన్నికల సంఘం, మూడు రాష్ట్రాల్లోని ఎన్నికల ప్రధాన అధికారులు స్పందించిన తీరు చూస్తే... ‘‘నా వేలు నీ కంట్లో పెడతా.. నీ వేలు నా నోట్లో పెట్టు..’’ అన్న చందాన ఉన్నది కదూ !!!

‘‘ఒకవేళ రాహుల్ గాంధీ తన ఆరోపణలకు  చూపిన సాక్ష్యాధారాలు తప్పని తేలితే... భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 227/229 కింద ఆయనకు మూడేళ్ళ వరకు జైలు శిక్ష, ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950 లోని సెక్షన్ 31 కింద ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది’’ అని మూడు  సంబంధిత రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులు ఆయనకు రాసిన లేఖలో హెచ్చరించారు.


తప్పేముంది... కరెక్టే. ఏ పేచీ లేదు దీనితో... 

కానీ తిరకాసు ఎక్కడుందీ...అంటే...

రాహుల్ గాంధీనే అయినా,  సామాన్య పౌరుడు  అయినా...వారి  ఆరోపణలు, దాని తాలూకు సాక్ష్యాధారాలను ఓటర్ల నమోదు నిబంధన 20(3)(బి) కింద నిర్ణీత ఫారంలో డిక్లరేషన్ ఇవ్వాలి. అలా ఇస్తూ...‘‘ నాకు తెలిసినంత వరకు, నేను నమ్మినంత వరకు ఇవి నిజాలు’’ అన రాసి సంతకం చేయాలి’’... అని వారు ఆయనను కోరుతూ లేఖలు రాసారు. ఆ ఆరోపణలు అబద్దమని తేలితే ఆయనకు జైలు శిక్ష తప్పదట.

మరి నిజమని తేలితేనో...???  నిబంధనల ప్రకారం వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తారట. అంతే తప్ప దురుద్దేశంతో జరిగిన ఆ అక్రమాలకు, దానివల్ల జరిగిన అపారమైన నష్టానికి బాధ్యులయిన వారిపై ఏం చర్యలుంటాయో ఎక్కడా మాట మాత్రం కూడా వాటిలో ప్రస్తావించలేదు.

రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే...‘‘నేను ఒక రాజకీయ నాయకుడిని. నా ఆరోపణలకు సాక్ష్యంగా ఈ ఆధారాలను  బహిరంగంగా ప్రజల ముందుంచా.. ఇదే ప్రమాణం చేసి నేను సమర్పిస్తునట్లు..’’

రాహుల్ గాంధీ ఈ దేశంలో ఒక సాధారణ పౌరుడే అయినా కేవలం సామాన్య పౌరుడి హోదా కాదు ఆయనది. కొన్ని అంశాలలో పార్లమెంటే సుప్రీం. అటువంటి పార్లమెంటులో సభ్యుడు, ప్రజా ప్రతినిధుల సభ అయిన లోక్ సభలో ప్రతిపక్షనాయకుడు, ఒక జాతీయ పార్టీ అగ్రనేత...  ఆ హోదాలో ఆయన ఒక ఫిర్యాదును పత్రికా విలేకరుల సమావేశంలో బహిరంగంగానే చేసారు. దానికితన దగ్గరున్న  ఆధారాలు కూడా చూపుతున్నారు,

ఒక ప్రభుత్వ వ్యవస్థకు అది చాలు ఫిర్యాదులను పరిశీలించి నిజనిర్ధారణ చేసి నివేదిక ఇవ్వడానికి.  ఎవరూ ఫిర్యాదు చేయకుండానే... కేవలం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా కోర్టులు, మానవ హక్కుల సంఘాలు వాటిని సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నాయి కదా! అయినా ‘‘కాగితం రాసివ్వు, ఫలానా రూలు ప్రకారం ఫలానా ఫారం నింపు, ఫలానా ప్రమాణం చెయ్యి, ఫలానా చోట సంతకం పెట్టు...’’ అని అడగడం ఏమిటి ?

ఆ తరువాత కూడా అది నిజమని తేలితే..దానికి బాధ్యులైన వారిపై తీసుకునే చర్యలు చెప్పి ప్రజలకు నమ్మకం కలిగించకుండా... ఫిర్యాదుదారుకు ‘జైలు శిక్షల’ బెదిరింపులేమిటి ?’

కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయపార్టీ నాయకులు ఇటువంటి  హెచ్చరికలు చేయవచ్చు... అది రాజకీయంగా సమర్ధనీయం అవుతుంది. కానీ ఒక రాజ్యాంగ సంస్థఅయిన ఎన్నికల సంఘం అధికారులు ఇలా బ్లాక్ మెయిల్ ధోరణి చూపడమేమిటి ?

తమ దగ్గరికి వచ్చిన ప్రతి దావా విషయంలో దానికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు  సుప్రీంకోర్టు కూడా ఇలాగే హెచ్చరించ వచ్చు కదా !

హెచ్చరించొచ్చు... అధికారంలోఉన్నవారు, వారికి తైనాతీలుగా ఉన్న వ్యవస్థలు ఇలాగే  ఫిర్యాదుదారులను బెదిరిస్తూపోతే... ‘ప్రజాస్వామ్య’ దుకాణానికే కాదు... ప్రజలందరూ కూడా  నవరంధ్రాలకు సీల్ వేసుకునే రోజు ఎంతో దూరంలో  ఉండదు !!!

- ములుగు రాజేశ్వర రావు

..............

    ‘‘ ఒక నదికి గానీ , ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో   దీనిని ‘ ప...