పొలిటికల్(కాంపెయినింగ్) హాలిడే....

 


 * తెలంగాణకు కేంద్ర సాయం * బనకచర్ల * కాళేశ్వరం  * ఫోన్ టాపింగ్ * వేశ్యల రాజధాని * కాంగ్రెస్-బిజెపి-బిఆర్‌ఎస్.. వీటిలో రెండు కలుస్తాయని మూడోది అనడం * కులగణన.... ఇలా చాలా వాటిపై.....

ఆరోపణలు, ప్రత్యారోపణలు, అబద్ధాలు, తిట్లు, పుకార్లు, విద్వేష ప్రసంగాలు... వీటన్నింటికీ కొద్దిగా ఎక్కడో నిజాలను కూడా  జోడించి  ప్రతిరోజూ ప్రజలను గందరగోళపరచడం ఆనవాయితీగా మారింది.  ఆరోగ్యకరమైన ఆలోచనలతో ఎదగాల్సిన సమాజాన్ని కలుషితం చేసి జనం మెదళ్ళను కుళ్ళబొడుస్తున్నారు.  ఎవరి వాదన వినేటప్పుడు వారి వాదనే సరైనదనిపించేత నమ్మకంగా చెబుతున్నారు. అత్యున్నత స్థాయి జాతీయ రాజకీయ నాయకుల నుంచీ, రాష్ట్రస్థాయి...  గల్లీ లీడర్ల వరకు అందరిదీ ఇదే వరస. కొత్త విషయం ఉండదు, ప్రతి రోజూ, ప్రతి గంటా... ఇదే బాగోతంతో ప్రజలను వెర్రివెంగళప్పలను చేస్తున్నారు. వారి చెవుల్లో వారికి తెలియకుండా పున్నాగ పూలు, మందారాలతో సరిపెట్టకుండా ఏకంగా పారిజాత పుష్పాలనే తెచ్చి పెడుతున్నారు.

 

ఎందుకిలా జరుగుతున్నది ???

లోగడ న్యూస్ ఛానళ్ళు, సామాజిక మాథ్యమాలు లేని రోజుల్లో పత్రికా విలేకరులు ... రాజకీయ నాయకులు ఏవి చెబితే వాటినన్నిటినీ విని...జాగ్రత్తగా రాసుకుని...   వాటిలోని నిజానిజాలు బేరీజు వేసుకుని, పొట్టు అంతా దులిపేసి... ఎడిటోరియల్ డెస్క్ కు పంపితే... అక్కడ ఇంకా తాలు ఏదయినా మిగిలుంటే వడకట్టేసి... ఆ వార్త ప్రాధాన్యతను, అది మాట్లాడిన నాయకుడి స్థాయిని బట్టి... పాఠకులకు ఎంతవరకు అవసరమో అంతే ఉంచి, మిగతా సొల్లంతా నిర్దాక్షిణ్యంగా తుడిచేసి... ప్రచురించేవారు... నిజంగా ఆ వార్త ముఖ్యమయి, అక్కడ ఇచ్చిన సమాచారం తక్కువగా ఉంటే సదరు రిపోర్టరునడిగి మరింత జోడించి ప్రింట్ కు పంపేవారు. దీనిలో అస్పష్టతకు కానీ, గందరగోళానికి కానీ ఆస్కారం ఉండేది కాదు. అబద్ధమని తేలితే ముందే ఆపేసేవారు. వివాదాస్పదమనుకుంటే... సంబంధిత వర్గాలనుండి వివరణలు సేకరించి ఇచ్చేవారు. కాబట్టి పాఠకులు కూడా ఫిల్టర్ కాఫీలా సేవించేవారు తృప్తిగా. ఇప్పుడా ఫిల్టర్ పాయింట్లు లేవు. మూసీనీటికి, గండిపేట నీటికి  తేడాలేకుండా తెచ్చిన  సీసాలు మన మూతులకు బిగించి తాగించేస్తున్నారు.

రెండో కారణం ... ప్రెస్ మీట్లు. ఒకప్పుడు పత్రికావిలేకరుల సమావేశాలంటే రాజకీయ నాయకులకు పంచెలు తడుస్తుండేవి. బహిరంగ విచారణ జరుపుతున్నట్లుండేది. స్వేచ్ఛ, సభ్యత, సంస్కారాలు, గౌరవమర్యాదలు పాటిస్తూనే నిర్భయంగా ప్రశ్నలు అడిగి అన్ని సందేహాలను నివృత్తి చేసుకునే వారు.  ఉత్తుత్తి ఆరోపణలు, పేరుకోసం ప్రచార యావతో చేసినవి గుట్టుచప్పుడు కాకుండా చెత్తబుట్టల్లోకి వెళ్ళేవి. నాయకుడి స్థాయిని బట్టి వేయాల్సి వచ్చినా... సింగిల్ కాలమ్... ఎక్కడో ఓ మూలన పడేసేవారు.

కానీ ఇప్పుడు ప్రెస్ మీట్ అంటే... ప్రవచనకారుడి ముందు బుద్ధిగా కూర్చుని చెప్పింది చెప్పినట్టు, విన్నది విన్నట్లు రాసుకోవడం... డెస్క్ లో కూడా ప్రవచనకారుడి నెట్‌వర్క్ పనిచేస్తుంది కాబట్టి... అది శ్రీవారు ఎలా మాట్లాడారో అలానే ప్రచురిస్తున్నారు.(తసమదీయుల పేపర్లో  అయితే ఇదే వార్తను విస్మరించడమో లేదా ఖండఖండాలుగా నరికి పోగులు పెట్టడమో చేస్తున్నారు.) కానీ ప్రశ్నలు అడిగే సాహసం ఎవరూ చేయడం లేదు. ఒకవేళ తెలియక అడిగినా... మీడియా మేనేజ్మెంట్ వారు ... నొక్కేస్తారు. అందువల్ల ఒకే సమాచారం ఒకే నాయకుడు రోజూ ఇచ్చినా.... అబద్ధాలు పదేపదే వల్లె వేసినా,  పొంతన లేకుండా ఇచ్చినా.... అది అలా పోవలసిందే... ఆకర్షణీయమైన శీర్షికలతో...

మూడో కారణం... వేగం. న్యూస్ ఛానళ్ళు, సోషల్ మీడియా వేదికలు తామరతంపరగా విస్తరించడంతో.... ప్రెస్ మీట్ ముగియక ముందే... చాలా సార్లు ... అక్కడి నుంచే ....స్క్రోలింగులు, ముక్కలు, ముక్కలుగా వార్తలు... వైరలయిపోతుంటాయి. అసలు ముఖ్యమైన నాయకుల ప్రసంగాలయితే అన్నీ లైవే కదా... మైకుల ముందు సర్దుకుని కూర్చోక ముందే వారు తెరలపై లక్షలాదిమందికి దర్శనమిచ్చేస్తున్నారు. ఇది రాజకీయ నాయకులకు బాగా కలిసొచ్చే అంశం. వారి లోటుపాట్లను కప్పిపుచ్చుకోవడానికి, తప్పులకు కవరింగ్ ఇచ్చుకోవడానికి.  ఒక అబద్ధాన్నే అన్ని భాషల్లో పదేపదే చెబుతున్నా... లైవ్ కొనసాగుతూనే ఉంటుంది.

సో ... చెప్పదలచుకున్నదేమిటంటే...

ప్రజలకు అవసరమయిన ఒక సమాచారం, లేదా ప్రజలకు కొత్తగా తెలపాలనుకున్న సమాచారం ఒకటికి పదిసార్లు తనిఖీ చేసుకుని ప్రచురణ లేదా ప్రసారం చేసే యంత్రాంగం మాయమయిపోతున్నది. నిజం గడపదాటే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసి వస్తున్నది.  ఒక సమస్యపై  కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ అధికార పార్టీ నాయకుడు రోజూ మాట్లాడుతున్నా, వివరణ ఇస్తున్నా... ‘‘ఈ సమస్యపై అధికార పార్టీ నోరు తెరవడంలేదు, ఫలానా నాయకుడి నోరు పడిపోయింది. మేం ఇన్ని సార్లు ఇన్ని ఆరోపణలు చేస్తున్నా... స్పందించడం లేదు’’ అని ప్రతిపక్షనాయకులు ఆరోపణ చేస్తూనే ఉంటారు... విధేయులైన మీడియా సిబ్బంది వాటిని మోస్తూనే ఉంటారు.దీనితో ప్రజలకు ఇది రోజువారీ తలనొప్పి అయింది. మొత్తం 24 గంటల వార్తా ప్రసారాల్లో.... కేవలం 10 నిమిషాల మేర కూడా ప్రజలకు ఉపయోగకరమైన వాస్తవిక సమాచారం ఉండడం లేదు.

ఎన్నికల సమయంలో సర్వే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి. మిగతా రోజుల్లో సబ్బులు, చాక్లెట్లు, టాయిలెట్ల శుభ్రతకు సంబంధించిన ప్రకటన తాలూకు సర్వేలు మాత్రం విరివిగా వస్తుంటాయి... జనాల కొనుగోలు శక్తి, మారుతున్న అలవాట్లమీద... అంతే తప్ప... రాజకీయ నాయకులు, వారి పార్టీల నిర్వహణమీద, ఒక్కో నాయకుడికి మీడియాలో ఇస్తున్న కవరేజ్  మీద, అన్నిటికీ మించి అవినీతి ఆరోపణల మీద ప్రజలు ఏమనుకుంటున్నారో... సర్వేలు జరగడం లేదు.

కాళేశ్వరం, కార్ రేసింగ్, ఫోన్ టాపింగ్... విషయాలనే చూడండి,  ముఖ్యంగా మీడియా బాధ్యులు... ప్రతిరోజూ అన్నన్ని గంటలు, అన్నన్ని ఆరోపణలు... అంతంత ప్రచారమా... ఓ..కే... రాజకీయ నాయకులకు అవసరం కావచ్చు... కానీ మీడియా ప్రజలకోసం ఉన్నదా !!! నాయకులకోసమా !!! అటువంటి విషయాల్లో ప్రజలకు స్పష్టత ఇచ్చి... అనవసరమైన ఊకదంపుడును అరికట్టలేరా... ధరలపెరుగుదల, ప్రజా రవాణా తగ్గిపోవడం వంటి ఎన్నో ప్రజా సమస్యలను గురించి ఎంత సేపయినా ... అంటే అవి పరిష్కారమయ్యేవరకు ప్రసారం చేసుకోవచ్చు గదా !!!

ఇప్పుడు చేయాల్సిందేమిటంటే...

సమాచారం ఎంత స్వచ్ఛంగా, సక్రమంగా, సమగ్రంగా ఉంటే... ప్రజలు అంత తెలివిగా, అంత వివేకంతో, అంత బాధ్యతగా ఆలోచించుకోగలుగుతారు, దానికి తగ్గట్లు అంత పరిపక్వతతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు... ఇదే ప్రజాస్వామ్యంలో, స్వేచ్ఛాయుత రాజ్యంలో కీలకం. దీని తరువాతే ఏదయినా... ఇప్పుడా ఆ సమాచారం డ్రైనేజీ కాల్వగా మారి కంపుకొడుతున్నది...  ఏదయినా  సమాచారం అందిన వెంటనే మీడియా ప్రసారం చేయకుండా... తనిఖీలు చేసుకుని.... సందిగ్ధతలు తొలగించుకుని, అబద్ధాలను తొలగించి  ప్రజలకు ఎంత అవసరమో అంతే చేరవేయాలి.... ఇప్పుడున్న పరిస్థితుల్లో అది  సాధ్యమా.... ఇంపాజిబుల్....  రాజకీయ పార్టీలు, మీడియా సంస్థల మధ్య అవగాహన, సమన్వయం ఉంటే సాధ్యమే కానీ...  అతిగా ఊహించడం , ఎక్కువగా ఆశించడం అవుతుంది.

అత్యంత సులభమైన మార్గం... ప్రజలకు సుళువుగా ప్రశాంతతను అందించే మార్గం ఒకటే....ఇది ఆచరణాత్మకం కూడా...

పొలిటికల్ (కాంపెయినింగ్) హాలిడే ప్రకటించడమే... వారానికి నాలుగైదు రోజులు ప్రకటిస్తే చాలు...అంటే ఆ రోజుల్లో  అత్యవసర ప్రభుత్వ ప్రకటనలు తప్ప,  పత్రికల్లో, న్యూస్ చానళ్ళలో, ఇతర త్రా రాజకీయ సంబంధమైన ప్రచారాలకు స్వస్తి పలకడం. 

సొంత అజెండాతో తప్ప... నిజమైన ప్రజా సమస్యలపై ఏ రాజకీయ పార్టీ (కమ్యూనిస్టు పార్టీలతో సహా) ఆందోళనలు, నిరసనలు తెలపడంలేదు కాబట్టి... కింది స్థాయిలో ఉండే వారి  నాయకులకు,  కార్యకర్తలకు కూడా ఆటవిడుపుగా ఉంటుంది.

 ముందు ఆ పని మీద ఉందాం...దానికి డిమాండ్ చేద్దాం. ఇట్నుంచీ సాధ్యం కానిది.. అట్నుంచీ నరుక్కుంటూ వస్తే సరి.....

-ములుగు రాజేశ్వర రావు.

 



గమనిక : పొలిటికల్(కాంపెయినింగ్)హాలిడే అనే సలహా.... వ్యంగ్యాత్మకం.

అది సాధ్యం కాదని తెలుసు.

పోలింగ్ తేదీకి ముందు ఎన్నికల ప్రచారంపై 48 గంటలు  నిషేధం ఉంటుంది... 

అప్పుడు అంతా ప్రశాంతంగా ఉంటుంది. దాని స్ఫూర్తితో చెప్పిన మాట...

రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రతి రోజూ మీడియా హోరెత్తిస్తున్నది.

( ఆ హోరులో ప్రజల విషయంలో దాని ప్రాధాన్యతలను మీడియా  మర్చిపోతున్నది).

జనం భరించలేకపోతున్నారు... అని చెప్పడానికి- నా ఈ పోస్ట్ కు వస్తున్న సానుకూల స్పందనే దానికి నిదర్శనం.

నిజానికి... రాజకీయ పార్టీలు తమ తప్పొప్పులను కప్పిపుచ్చుకోవడానికి,

జనం దృష్టిని మళ్ళించడానికి వారిని వీలయినంత గందరగోళ పరచడం అనేది

ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఒక రాజకీయ క్రీడ.

దీనిలో మీడియా కూడా దానివంతు ఆట అది ఆడుతున్నది.

ఇప్పుడు మన దగ్గర అది పరాకాష్ఠకు చేరుకున్నది.

....

 

 

హేమంటివి... హేమంటివి...!!!!

 

 

 పౌర పాత్రికేయుడు :- ఆగాగు! సీనియరా ! హహ్హ ఏమంటివి? ఏమంటివి ? పాత్రికేయ జాతి నెపమున కొమ్మినేనికి  నిలువ అర్హత ఉందందువా ! ఎంత మాట, ఎంత మాట ! ఇది పాత్రికేయ విలువల  పరీక్షయే కాని ప్రజాస్వామ్య పరీక్ష కాదే ? కాదు, కాకూడదు, ఇది పాత్రికేయుల పరీక్షయే అందువా ! అంతకుముందు నీవు పని చేసిన పత్రిక విలువలు ఎట్టివి ?  పాత్రికేయునిగా అతి జుగుప్సాకరమైన నీ పాత్రికేయ జీవితమెట్టిది ?

 

రాజకీయ పార్టీల సిఫార్సులతో పుట్టితివికదా ! హహ్హ నీది ఏ పార్టీ మీడియా ? ఇంతయేల, మన సంపాదకులే ఎందరో ఇలా జనియించలేదా !

 

నాతో చెప్పింతువేమయ్యా ,  సందర్భావసరములనుబట్టి రాజకీయ, స్వార్థ  ప్రయోజనములతో  సంకరమైన మన పాత్రికేయ రంగము- ఏనాడో సంస్కారహీనమైనది, భ్రష్టుపట్టినది...  కాగా, నేడు విలువలు.. విలువలు అను వ్యర్ధవాదమెందులకు?

 

సీనియర్ :- నాయనా యువ పౌర పాత్రికేయా! ఏరుల, పారుల, సీనియరుల  జననములు మనము విచారించదగినవికావు. ఇది, నీవన్నట్లుగా, ముమ్మాటికీ పాత్రికేయ పరీక్షయే! పత్రికా రచన చేస్తున్న ప్రతి వారూ పాత్రికేయులే ! వారిలో పార్టీ పత్రికల్లో  పనిచేస్తున్న వారే పెత్తనం చలాయించగల పాత్రికేయులు! అట్టివారే ఇటువంటి వివాదములలో పాల్గొనుటకు అర్హులు!

 

పౌర పాత్రికేయుడు:- ఓహో ! రాజకీయ పార్టీల అండలా  అర్హతను నిర్ణయించునది. అయిన మా ప్రజాస్వామ్యములో సస్యశ్యామలమై వెలుగొందునటుల, మా పౌర సమాజ పత్రికకు ఇప్పుడే అంకురార్పణ గావించెదను,  చైతన్యవంతుడయిన  ఒక యువ పౌరుని సంపాదకునిగా నియమించుచున్నాను.

 

సోదరా.. ప్రజా సంఘ నాయకుడా ! అనర్ఘనవరత్న ఖచిత కిరీటమును వేగముగ తెమ్ము; మామా.. సిటిజన్ మీడియా సార్వభౌమా ! సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము; జర్నలిజం స్కూలు విద్యార్థులారా ! మంగళతూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు,

 

పుణ్యాంగనలారా ! నవయువ పౌర పాత్రికేయుల  పాలభాగమున కస్తూరీతిలకము తీర్చిదిద్ది, వీరగంధము విదరాల్పుడు. నేడీ సకలమహాజన సమక్షమున, పండిత పరిషన్మధ్యమున సర్వదా సర్వథా, శతథా సహస్రథా ఈ పాత్రికేయరంగమున పేరుకుపోయిన  మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను.

 

వార్తల ప్రచురణకు, ప్రసారములకు కైంకర్యములు గ్రహించుచున్న పాత్రికేయులారా ! మీరందరూ కొమ్మినేని మహారాజువెంట ఆయన విలువలను సమర్ధించు పరివారము వెంట  నడువుడు;


తెలుగు సమాజ పౌరులారా, మీ బుద్ధి ఇకనయిననూ  వికసనము పొందుగాక...  నా ఈ ప్రక్షాళనా యజ్ఞమునకు జేజేలు పలికెదరుగాక, ప్రజల, ప్రభుత్వ ఖజానానుంచి పలు రాయితీలు, ప్రోత్సాహకాలతో మీరు  పోషించుచున్న మీడియాను సప్త సముద్రములలో నిమజ్జనం కావింపుడు... లెండు.

-ములుగు రాజేశ్వర రావు

....... 

How poor is poor in India ?

 


మన పేదలు ఎంత పేదరికంలో ఉన్నారు ???

(ఇది మరీ డ్రై సబ్జెక్ట్ అని బెదరకండి. చివరివరకూ చదవండి. ఆసక్తికర సమాచారం)

మనిషి మారిపోతున్నాడు. వేషం మారుతున్నది, భాష మారుతున్నది, ఆహారవిహారపుటలవాట్లు మారిపోతున్నాయి. మొత్తంగా జీవన శైలి... వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా..అన్నిటికీ మించి ఆర్థికంగా మారిపోతున్నది. అది కూడా మునుపటిలాగా నత్తనడకతోకాదు, బ్రహ్మోస్ క్షిపణిలాగా ఊహకందని వేగంతో...

 ఈ మార్పు మీకూ నాకూ అందరికీ కనిపిస్తున్నది... 

కనిపించనిది మన ప్రభుత్వాలకు, మన ప్రజా ప్రతినిధులకు, మన రాజకీయ పార్టీలకు... ఒకవేళ కనిపించినా సవ్యదిశలో కాకుండా అపసవ్య దిశలో కనిపిస్తున్నది...

...అని ఎలా చెప్పగలం???


       పేదలు అంటే ఎవరు? మధ్యతరగతి అంటే ఎవరు? 

          ఈ ప్రశ్నలకు ప్రభుత్వాలవద్ద నిర్వచనాలుంటాయి. వాటితో అధికారిక (సర్వే) గణాంకాలు కూడా ప్రకటిస్తారు.  అవే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రతిఫలిస్తుంటాయి...

పేదలు : అంతర్జాతీయ నిర్వచనం ప్రకారం ... పేదరికం అంటే- కనీస అవసరాలతో జరుగుబాటుకు తోడ్పడే ఆస్తిపాస్తులు కానీ, ఆదాయం కానీ లేకపోవడం. కటిక పేదరికం అంటే – తిండి, బట్ట, గూడువంటి కనీస వ్యక్తిగత అవసరాలు తీరే దారికూడా లేకపోవడం. ఈ నిర్వచనం దేశాన్నిబట్టి, మన దేశంలో కూడా రాష్ట్రాన్నిబట్టి మారుతున్నా, సారాంశం ఇంచుమించు ఇదే.

24 ఫిబ్రవరి, 2024న గణాంకాల మంత్రిత్వశాఖ ప్రచురించిన ‘నెలసరి ఇంటి ఖర్చు’ సర్వే ప్రకారం .. ఈ కొలమానం గ్రామాల్లో నెలకు రు.1441, పట్టణాల్లో రు2,087గా ఉంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం – భారతదేశంలో కటిక పేదరికం 2011లో 22.5 % ఉండగా, 2019 నాటికి 10.2% కు తగ్గింది.  దీని నివేదిక ప్రకారం 2024లో కటిక పేదరికంతో మగ్గుతున్న వారు 12 కోట్ల 90 లక్షల మంది  ఉన్నారు.(రోజుకు రు.181ల కంటే తక్కువ సంపాదనతో బతుకుతున్నవారు). ఈ సంఖ్య 1990లో 43కోట్ల10లక్షలుగా ఉంది. 

(ఎంత తగ్గిందో గమనించండి.)

మధ్యతరగతి : ప్రస్తుతం రు.5-30 లక్షల మధ్య వార్షిక ఆదాయం ఉన్నవారు మధ్యతరగతి వారట. రు.30 లక్షల వార్షిక ఆదాయం అంటే నెలకు రు.2.5 లక్షలు. మరి ఈ కుటుంబం మధ్య తరగతి కిందకు వస్తుందా ? రు.5 లక్షల కనీస ఆదాయం అంటే నెలకు రు. 40 వేల  ఆదాయం వారు కూడా మధ్యతరగతి అనేది వారి లెక్క. ఇక అగ్రకులాల్లో ఆర్థిక వెనుకబాటు వర్గం(ఇడబ్యుఎస్) నిర్ధారణ కు కొలత... వార్షిక ఆదాయం రు.9 లక్షలు..అని నిర్ణయించారు.

పై లెక్కల్లో పొంతన ఎక్కడయినా ఉందేమో జాగ్రత్తగా చూడండి!!!

ఇక అసలు విషయానికొద్దాం.....

వ్యవస్థీకృత రంగంలో పన్ను వసూళ్ళు నిక్కచ్చిగా ఉంటాయి. జీతగాళ్ళనుంచి కూడా ముక్కుపిండి ఠంఛనుగా వసూలు చేస్తారు. అంతవరకూ బాగానే ఉంది.

మరి అవ్యవస్థిత రంగం మాటేమిటి ?

ఈ రంగంలో ... లెక్కకు రాని, లెక్క చూపని లావాదేవీలు అంటే   వీథి వ్యాపారాలు, చిట్టీలు, కూరగాయలు, పళ్ళు, టిఫిన్ బండ్లవంటివాటి ద్వారా జరిగేవి చాలా ఉంటాయి... నిజానికి వ్యవస్థీకృతం రంగం కంటే ఇది ఎన్నో రెట్లు పెద్దది. ఇక్కడ ఆదాయవ్యయాలు కాకుల లెక్కలే. 

హైదరాబాదు బస్తీల్లో వారంలో ఒక రోజు కూరగాయల సంత ఉంటుంది. ఒక బండి నడిపే వ్యాపారి పక్కన అతని భార్యది మరో బండి. వీరిద్దరూ ఆ ఒక్క రోజు మధ్యాహ్నం 3 గంటలనుంచి రాత్రి 9 గంటల లోపల రు.35‌-40 వేల వ్యాపారం(లాభం కాదు, టర్నోవర్) చేస్తారు. ఒక చిన్న గల్లీలో ఒక వ్యాపారి/ఉద్యోగి పార్ట్ టైంగా 10, 12 క్రేట్ల పాలు అమ్మడం ద్వారా నెలకు రు.9 లక్షల టర్నోవరు చేస్తాడు.(వీటిలో వారి లాభం అంతా మీరే సులభంగా లెక్కగట్టవచ్చు).  సక్రమంగా నెలంతా ఒక క్యాబ్ స్వతంత్రంగా నడిపే  డ్రైవరు నెలకు.రు50వేల పైనే సంపాదిస్తాడు.  ఇదంతా వీరి నుండి సేకరించిన సమాచారమే. వీరి కుటుంబాల్లో మరీ చిన్న పిల్లలు తప్ప దాదాపు అందరూ సంపాదనాపరులే. 

మంచి సెంటరులో టిఫిన్ బండి(ఇదీ పరిమిత సమయంలో) నడిపే వాడు కేవలం దోసె మాస్టర్‌కు ఇచ్చే జీతం నెలకు రు.30వేల పైమాటే. జూబిలీ హిల్స్ లో నెలకు లక్షల్లో కిరాయి కట్టి నడిపే ఒక రెస్టారెంట్ యజమాని - ఎదురుగా ఉండే గల్లీలో ఒక టిఫిన్ బండి ప్రారంభమైన  అతి కొద్ది నెలల్లోనే తన దుకాణం మూసేయక తప్పని పరిస్థితి. ఆ సమయంలో  కాకతాళీయంగా  ఒక పత్రికావిలేకరి న్యూస్ స్టోరీ చేస్తూ దాని యజమానిని కలిస్తే... ‘‘మాకు పన్నులు, కిరాయిలు, కరెంటు బిల్లులు, పోలీసుల మామూళ్ళు, రాజకీయ పార్టీలవారికి చందాలు, పార్కింగ్ లేదని ఛలాన్లు,  లేబర్ చట్టాలు అన్నీ ఉంటాయి. ఫుట్ పాత్ మీద వ్యాపారం చేసేవారికివేవీ ఉండవు కదా... అంటూ నేను కూడా ఇదే వ్యాపారంలో కొనసాగితే బండి నడుపుకోవడమే బెటర్ ...’’ అంటూ వాపోయాడు. కోఠీ సుల్తాన్ బజార్లో... వీథుల్లో దుకాణాలముందు కనిపించే బండ్లన్నీ... ఆయా దుకాణాల తాలూకు యజమానులవే అన్న సంగతి తెలిస్తే ఆశ్చర్యపోతారు.

సాధారణంగా ఈ చిరువ్యాపారుల్లో దాదాపు ప్రతి కుటుంబానికీ వారి ఊర్లో స్వంతంగా ఒక ఇల్లో, కొద్దిపాటి పొలమో తప్పనిసరిగా ఉంటుంది.  వీరి  (కొద్దిమందయినా) పిల్లలను ప్రైవేటు స్కూళ్ళల్లో డొనేషన్లు కట్టి చదివిస్తుంటారు. ( మా ఇంట్లో రు.2700లకు పనిచేసే లంబాడీ వర్కర్ తన ముగ్గురు పిల్లలను ప్రైవేటు స్కూళ్ళల్లో చదివిస్తూ....  ఈ మధ్యనే  ఒక్కొక్కరికి రు.20/30 వేల చొప్పున దళారీలకు డబ్బులిచ్చి ఇద్దరు పిల్లలను గురుకులాల్లో చేర్పించింది. భర్త ఆటో డ్రయివర్. మరో రెండు ఆటోలున్నాయి. కిరాయికిస్తాడు. ఊళ్ళో పొలం ఉంది. ఇల్లుంది). మురికివాడల్లో కనిపించే ఇళ్ళల్లో ప్రతి ఇంటికీ కేబుల్ కనెక్షన్ తో టీవీ ఉంటుంది. ఇది పైకి కనిపించేదే. వీరికి స్వంత వ్యాపారాలు, వాహనాలు (టూవీలర్లు), స్మార్ట్ ఫోన్లు ఉంటాయి.. వీరందరూ ప్రభుత్వ లెక్కల్లో పేదలే. ఉచిత పథకాలకు అర్హులే.

వీరు పేదలయినప్పుడు కటిక పేదలు, నిరుపేదలు, నికృష్ట పేదలను కూడా వీరితో సమానంగా లెక్కగట్టడమేనా! అట్టడుగువర్గాల రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ అని ఒకటుందిగా, అమలయినా కాకపోయినా... అటువంటిదేదో ఇక్కడ కూడా ఉండాలిగా వడబోతకు. ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి అంటున్నప్పుడు...ఎగువ పేదలు, దిగువ పేదలు, సంపన్న పేదలంటూ ఏదో రకమైన నిర్వచనం ఇవ్వాలిగా. ఇదే అడిగితే.. వారి ‘ఆదాయ పరిమితి’ లెక్కలు చూస్తాంగా అంటారు అధికారులు. మరి వ్యక్తుల, కుటుంబాల ఆదాయ వ్యయాలు నిక్కచ్చిగా తేల్చడానికి సమాజంలో  ఇన్ని దశాబ్దాలుగా వస్తున్న మార్పులకు వీరు అనుసరిస్తున్న కొలమానాలు ఏమిటి ? చేస్తున్న సమీక్షలు,  సవరణలు ఏమిటి ?

ఓ చిన్న ప్రహసనం లాంటి ఉదాహరణ : రేషన్ కార్డుల మీద దొడ్డుబియ్యం ఇస్తున్నప్పుడు ... వీరిలో చాలా మంది తీసుకోలేదు. తీసుకున్నవారిలో దాదాపు అందరూ బయట కిలో రు.10-15లకు  అమ్ముకున్నట్లు ప్రభుత్వమే బహిరంగంగా అంగీకరిస్తున్నది కదా... అంటే (వారందరి జీవన ప్రమాణాలు  మెరుగయ్యాయి కాబట్టి) సన్నబియ్యం ఇచ్చేవరకూ వారు బహిరంగ మార్కెట్లో రు.50లకో, 60లకో  కొనుక్కుని పూట గడిపినట్టే కదా !

పేదల పథకాల్లోని వైరుధ్యానికి, విలక్షణతకు ఒక  ఉదాహరణ :

‘‘బహిరంగ మార్కెట్లో బియ్యం కిలో రు.6-7లు ఉన్నప్పుడు రు.2/- లకే ఇస్తే ప్రజలు ఎన్టీఆర్ కు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు బియ్యం కిలో.50-60లు ఉన్నా అదే రు.2లు లేదా రు.1కి ఇవ్వడమా !!!’’అని రాష్ట్రంలో క్యాబినెట్ హోదాలో ఉన్న ఒక మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ఇటీవల బహిరంగంగా వాపోయినా .... ఇప్పటివరకు దానిమీద సమాజంలో ఏ వర్గం నుండికానీ, ఏ రాజకీయ పార్టీనుండి కానీ, నాయకుడినుండి కానీ, ఏ ఆర్థిక నిపుణుడి నుండి కానీ, ఏ మీడియా సంస్థనుండి కానీ, ఏ స్వతంత్ర విలేకరినుండి కానీ స్పందన నామ మాత్రంగా కూడా లేదు.

అదే సమయంలో... ‘‘మా పార్టీని తీసుకెళ్ళి ఫలానా పార్టీలో కలిపే ప్రయత్నం జరుగుతున్నది’’ అని ఒక నాయకురాలు అన్న మరుక్షణం నుంచీ ఇప్పటివరకు రాజకీయపార్టీలు, నాయకులు, మీడియా సంస్థలు, సామాన్య పౌరులు...ఇలా అందరినోటా రోజూ ఇదే చర్చ, రచ్చయి ఆగకుండా నడుస్తున్నది....

అంటే ఈ పరిణామం దేనికి సంకేతం ???

కాళ్ళూ చేతులు చచ్చుబడిన ఒక సమాజంలో

మన ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టంగా చూపుతున్న దృశ్యం ఇది.

ఇదంతా చదివి నేను పేదల నోరు కొట్టే ప్రయత్నాలు చేస్తున్నా అనుకోకండి తొందరపడి...

ఒకానొక సమయంలో – జనాలను మాయలతో ముంచెత్తే రాజకీయం ఒంటబట్టక ముందు... 1980ల్లో –అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అమాయకంగా... ఓ రహస్యం బయటపెట్టాడు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో ప్రతి రూపాయికి  15 పైసలమేర మాత్రమే లబ్దిదారులకు అందుతున్నదని కుండబద్దలుగొట్టారు. దొంగకు తేలు కుట్టినట్లు .. దేశంలోని అధికారపార్టీలు కక్కలేక, మింగలేక విలవిల్లాడినా... దానిని అంగీకరించక తప్పలేదు.

మరో ఉదాహరణ : ఏళ్ళ తరబడి ఒక కుటుంబం రేషన్ కార్డు ఉపయోగిస్తున్నది లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్నది.. ఇన్ని దశాబ్దాలుగా ఆ కుటుంబం ఆర్థికంగా ఏమాత్రం ఎదుగూబొదుగూ లేకుండానే ఉందా ?...ఔను అనుకుంటే... పేదరికాన్ని తగ్గించామని ప్రగల్భాలు పలికే ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందయినా ఉండాలి లేదా ఆ కుటుంబం అయినా ప్రభుత్వాన్ని మోసగిస్తూ లబ్దిపొందుతూ ఉండాలి.. అంతేగా !!!

అందుకే మనం మన ప్రభుత్వాలను, మన రాజకీయ నాయకులను తెలిసితెలిసీ గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నిస్తూ పోవాలి...

మనకు ప్రశ్నించడం చేతకాదని మాత్రం అనకండి. ప్రశ్నించడంలో మన సామర్ధ్యం ఎంత వీరత్వంతో, ఎంత అరివీరభయంకరంగా  ఉంటుందో ఫేస్ బుక్కుల్లో, వాట్సాప్పుల్లో మన అకౌంట్లు చూస్తే తెలుస్తుంది. మన గాండ్రింపులు ఇక్కడే కాదు,  సామాజిక మాథ్యమాలు దాటి ఇంటి గడపదాటి బయట కూడా ప్రదర్శించగలగాలి. లేకపోతే పులుల జాతి అంతరించిపోయిందని.. ఇప్పుడున్న వి కాగితపు పులులేనని అటవీశాఖ వారిచేత మానవ వనరుల శాఖ వారు అధికారికంగా ప్రకటింప చేస్తారు.

-ములుగు రాజేశ్వర రావు


గమనిక : నేనూ మీ లాగే సాధారణ పౌరుడిని. ఆర్థిక వ్యవహారాల నిపుణిడిని కాను. కానీ వంకాయ కూరలో ఉప్పూకారాలు సరిగా ఉన్నాయోలేదో చెప్పడానికి  మనం పాకశాస్త్ర ప్రవీణులం(చెయ్యితిరిగిన వంటవాళ్ళం) కానవసరం లేదు కదా... అందుకే పూనుకున్నా.....

    ‘‘ ఒక నదికి గానీ , ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో   దీనిని ‘ ప...