తెలుగు టీవీ ఛానళ్ళ రిపోర్టర్లకు .....

  


‘‘ఒక నదికి గానీ, ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో దీనిని పరీవాహక ప్రాంతంఅంటున్నాం. నదిలోకి అలా వచ్చి చేరిన నీరు దిగువకు ప్రవహిస్తూ పోయి ఎక్కడో మరో నదిలోనో, సముద్రంలోనో కలుస్తుంటుంది.  అలా ప్రవహిస్తూ పోతున్న నదికి, దాని మార్గంలోవచ్చే ప్రాంతాలను పరీవాహక ప్రాంతాలు అనం.’’

 

‘‘వికారాబాద్, తాండూర్ ప్రాంతాలు... ఉస్మాన్ సాగర్(గండిపేట్), హిమాయత్ సాగర్, మూసీలకు పరీవాహక ప్రాంతాలు. మూసీనది దిగువకు ప్రవహిస్తూ... ఆ క్రమంలో పురానాపుల్, ఇమ్లీబన్, చాదర్ ఘాట్, ఉప్పల్...’’ అలా సాగుతూ పోతున్నప్పుడు ఈ మార్గంలోని  ప్రాంతాలను పరీవాహక ప్రాంతాలని అనం. అలాగే ప్రతి నదికీ, ప్రతి చెరువుకీ కూడా.’’

 

ఈ విషయం పరిశీలించి, విషయ పరిజ్ఞానం ఉన్న వారితో నిర్ధారించుకుని...  ఒప్పయితే సరిదిద్దుకోండి, ఇతర సహచరులు తప్పు చేసినా వారించండి... ఒకవేళ నేను చెప్పినది తప్పయితే తెలియచేయండి. నేను కూడా దిద్దుకోవడమేగాక మరోసారి ఇటువంటి ప్రవచనాలు చేసే ముందు జాగ్రత్తపడతా.

 

కుర్రాళ్లోయ్ కుర్రాళ్ళు.....

ఎడిటోరియల్ డెస్క్ లోపనిచేసే సీనియర్ జర్నలిస్టులతో పోలిస్తే... క్షేత్రస్థాయిలో రిపోర్టర్లుగా పనిచేసే మీకు సాధారణంగా వయసు, అనుభవం చాలా తక్కువ. కానీ అతి తక్కువ సమయంలో, అత్యంత ఎక్కువ సమాచారాన్ని, వీలయినంత తాజాగా అందించడంలో మీరు నిష్ణాతులు. ఎండనకా, వాననకా, సరైన తిండీ, సమయానికి నిద్ర లేక...గంటలతరబడి ఫీల్డులో గడుపుతూ మీ వంతు రాగానే ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా ... వీక్షకులకు సులభంగా అర్థమయ్యేవిధంగా  వార్తా కథనాలను అందించడంలో మీరు రాటుదేలి ఉంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని మెచ్చుకోవలసింది... ఆశువుగా, అనర్గళంగా, ఎక్కడా తడబడకుండా, తడుముకోకుండా ఎంత సేపయినా అలాగే మాట్లాడగలిగే...ఆ నైపుణ్యానికి నిజాయితీగా జోహార్లు.

 

ఆశ్చర్యం ఏమిటంటే దాదాపు మీరందరూ(అన్ని ఛానళ్ళ వాళ్ళు) ఇదే లక్షణాన్ని అతి తక్కువ సమయంలో పుణికిపుచ్చుకుంటూ ఉండడం... చాలా ముఖ్యమైన పరిణామాలు జరిగే సందర్భాల్లో... స్టూడియో నుంచి  దశాబ్దాల అనుభవం ఉన్న మీ సీనియర్లు దిగుతూ ఉంటారు, రంగంలోకి. కానీ మీలాగా ఆ వార్తల తాలూకు నేపథ్యం, పొల్లుపోకుండా వార్తా కథనం, జరగబోయే పరిణామాలు... వీటిని గుక్కదిప్పుకోకుండా ప్రజంట్ చేయడంలో. ...వారి అనుభవాలు, ఇతరత్రా విషయ పరిజ్ఞానం మీ   కుర్రకారు ముందు దిగదుడుపే.


 (అంతెందుకు... ముందుగా రాసుకున్న వార్తలను చాలా సార్లు రిహార్సల్స్ చేసుకుని, టెలిప్రాంప్టర్ ముందు చూసుకుంటూ ... ఏసి రికార్డింగ్ స్టూడియోల్లో నింపాదిగా కూర్చుని వార్తలు తప్పులు చదువుతూ, తడబడుతూ ఉండే  న్యూస్ రీడర్లను గమనిస్తే....తగిన గుర్తింపుకు నోచుకోని మీ వంటి  సిసింద్రీల ప్రతిభ స్థాయి ఏమిటో అర్థమవుతుంది).

 

నాదోసూచన. పని ఒత్తిడికొద్దీ కానీ, సమయాభావంవల్ల కానీ, లేదా సంబంధిత అంశాన్ని మీరు సరిగా అధ్యయనం చేయకపోవడంవల్ల కానీ, తప్పులు దొర్లుతున్నాయి. ఒక్కోసారి అతి విశ్వాసంవల్ల, చాలా సార్లు, మీకు అది తప్పని తెలియకపోవడం వల్ల, మీకు వాటిని వెంటనే సరిదిద్దేవారు లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది.డెస్క్ లో అయితే తప్పులను సరిదిద్దే వ్యవస్థ ఉంటుంది.(అలా ఉండి కూడా స్క్రోలిం  గుల్లో బొచ్చెడు అక్షర దోషాలు, వాక్య నిర్మాణ దోషాలు నిరాటంకంగా ప్రసారమవుతూ పోతున్నాయి). మీరు మాట్లాడింది ఎటువంటి అడ్డంకులు లేకుండా... నేరుగా వీక్షకుల చెవుల్లోకి, వారి మెదళ్ళల్లోకి చేరిపోతుంటాయి.

 

ఈ తప్పులకు  మీపైన ఉండే సీనియర్లు చెక్ పెట్టాలి. సమయానికి వారు గమనించకపోవడంవల్ల, లేదా వారికి కూడా సరైన అవగాహన, పడికట్టుపదాలు తెలియకపోవడంవల్ల- అవే తప్పులు... ఒప్పులయిపోయి అంటువ్యాథిలాగా ఇతర ఛానళ్లకూ, యూట్యూబ్ వార్తావీరులకూ సోకి... గుర్రపుడెక్క ఆకులాగా... విస్తరించిపోతున్నాయి.

 

ఒక క్లాసిక్ ఉదాహరణ : ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం విషయంలో...

 

ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మద్రాసులో చనిపోయి...భౌతిక కాయాన్ని వారి ఫాంహౌసుకు తరలించిన సమయంలో... అక్కడకు ముందుగా చేరుకున్న ఒక పెద్ద తెలుగు టివీ ఛానల్ రిపోర్టర్...కథనం మొదలు పెట్టాడు...‘‘మామూలుగా అయితే హిందూ సంప్రదాయం ప్రకారం దహనం చేస్తారు. కానీ ఎస్. పి.బాలుగారు జంగమలు కావడం మూలాన వారి ఆచారం ప్రకారం సమాధి చేస్తున్నారు...’’ అంటూ అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నంతసేపూ  అదేపనిగా రిపీట్ చేస్తూ పోతున్నాడు... కాసేపటికి మరో ఛానల్ కూడా ఈ పాట అందుకున్నది...

 

వారి కుటుంబం గురించి కాస్తోకూస్తో తెలిసున్న వారికి ఇదో పెద్ద షాక్. తెలియని కోట్లాదిమంది...‘‘ ఇన్నాళ్ళూ మేమేదో అనుకున్నాం..ఓహ్! ఇదా...’’ అని అనుకుంటున్న సమయం..

 

హైదరాబాద్ లో ఉండి...అందరిలాగే... ఆస్పత్రితో మొదలుపెట్టి అంతా ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న నాకు .. సీన్ అర్థమయిపోయింది. వెంటనే ఇక్కడ ఆ ఛానల్ స్టూడియో వారికి ఫోన్ చేస్తే, వారు మద్రాస్ ఆఫీసుకు విషయం తెలపాలనుకునేటప్పటికి... అక్కడ ముఖ్యులందరూ బయటకు వెళ్ళిపోయారని చెప్పారు.  మద్రాసులో ఉన్న ఇతర జర్నలిస్టు మిత్రులందరినీ కదిపి, కుదిపితే... ఓ గంట తరువాత (పరిస్థితి విషమించక ముందే) అసలు రిపోర్టర్ దాన్ని కరెక్ట్ చేసుకున్నాడు. మిగిలిన వారిని కూడా అలర్ట్ చేసాడు...

 

సో...బి అలర్ట్... ఆల్ ది బెస్ట్...

 

-ములుగు రాజేశ్వర రావు.

.......................

 నేపథ్య గాయకుడి నేపథ్యం 

https://chinavyasudu.blogspot.com/2021/10/blog-post.html?spref=tw



ఓట్ల దొంగతనమా ! ! ! - 1

 

ఓట్ల దొంగతనమా ! ! !  - 1

ఇప్పుడు దేశమంతటా ఓట్ల దొంగతనం మీద చర్చ రాజుకున్నది... ఇంకా కొంతకాలం ఈ మంటలు చెలరేగుతుంటాయి... ఇప్పుడే మొదలయింది కాబట్టి... దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం తెలుసుకుని ఉంటే... ఆ చర్చమీద మనకు ఒక అవగాహన ఏర్పడి ఉంటే... మనం కూడా సరైన వాదనలు వినిపించవచ్చు... అటు కానీ .. ఇటు కానీ...

నేను 2018లో, 2023లో జరిగిన ఎన్నికల సమయంలో...  భారత ఎన్నికల సంఘం తాలూకు రాష్ట్ర కార్యాలయంలో మీడియా విభాగంలో పనిచేసా...  దానికి ముందు- జర్నలిజానికి తోడు, ఎన్నికల సంఘం తాలూకు  పుస్తకాలను తెలుగులోకి అనువదించిన అనుభవం ఉంది. మరీ లోతుగా కాకపోయినా,  నా అవగాహన మేరకు నేను తెలుసుకున్న విషయాలను ఇక్కడ మీ ముందుంచుతున్నా... సమగ్రంగా ఒకే వ్యాసంగా అయితే పెద్దదయి  మీకు చదవడం ఇబ్బంది. కాబట్టి... చిన్నచిన్నవిగా వీలయినన్ని ఇస్తూ పోతా... వాటిలో ఓటరు జాబితా వంటి అంశాలే  కాకుండా, ఇవిఎంల ద్వారా ఓటింగ్ జరిగేటప్పుడు దొంగ ఓట్లు ఎలా పడే అవకాశం ఉంది ? అధికార పార్టీతో ఎన్నికల కమిషన్‌కు ఉండే అక్రమ, సక్రమ సంబంధాలు, ఎన్నికల కమిషన్ లో జరిగే అవినీతి కథలు... ఇలా చాలా చెప్పాలనుకుంటున్నా... అదీ నాకు తెలిసినంత వరకు...

నేను మిస్సయిన సమాచారం మీరూ తెలుపవచ్చు... నా తప్పులేవయినా ఉంటే సరిదిద్దవచ్చు... అంతే తప్ప... దీనిలో అర్థంపర్థంలేని వితండ వాదనలు, ఏదో ఒక పార్టీని నెత్తినెత్తుకుని అవాకులు చెవాకులు పేలడాలూ వంటివి మాత్రం చేయకండి...

 

పాత చింతకాయ పచ్చడి :

ఆగస్టు 7, 2025న ‘ఓట్ల దొంగతనం’ అంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు కొత్తవేం కాదు. ఎప్పటినుంచో ఉన్నాయి.. ప్రతి ఎన్నికలో... ఇవి అందరికీ అనుభవైకవేద్యమే...చాలా మంది బాధితులు కూడా. అసెంబ్లీ ఎన్నికలో ఉపయోగించుకున్న  ఓటు, మరో కొద్దినెలల్లోనే జరిగిన పార్లమెంటు  ఎన్నికలకు మాయమయి పోవడాలు, చచ్చిన వాళ్ళు బతికినట్లు, బతికిన వాళ్ళవి చచ్చిన(డిలీట్) జాబితాలో చోటు చేసుకోవడాలూ, ఒక వ్యక్తికి చాలా చోట్ల ఓట్లు ఉండడాలు, ఒక కుటుంబంలో అందరికీ ఓటర్ కార్డులున్నా...  పోలింగ్ సమయంలో కొందరివి గల్లంతు కావడాలు, ఒకే ఇంటి నంబరుతో చాలా ఓట్లు, ఓటరు కార్డుమీద ఇతరుల ఫొటోలు... ఇలా...

రాహుల్ గాంధీ చేసిన 5 ఆరోపణలు కూడా ఇవే. డూప్లికేట్ ఓట్లు, నకిలీ లేదా దొంగ చిరునామాలు, ఒకే ఇంటి నంబరు మీద చాలా ఓట్లు(50, 100, 150..) ఉండడం, తప్పుడు ఫొటోలు, ఫారం-6 దుర్వినియోగం.  తన ఆరోపణలకు బలం చేకూర్చడానికి ఒక నియోజకవర్గాన్ని శాంపుల్ గా తీసుకుని శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిర్ధారించుకున్న సాక్ష్యాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. బెంబేలెత్తిన ఎన్నికల సంఘం... ఒక స్వతంత్ర, రాజ్యాంగ వ్యవస్థగా దాని మీద ఆరోపణలు, అనుమానాలు వస్తున్నప్పుడు..ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం... ఫిర్యాదులను వాటి ఫార్మాట్ లలో ఇవ్వాలని  రాహుల్ గాంధీని పదేపదే డిమాండ్ చేయకుండా,  తప్పయితే జైలుశిక్ష ఉంటుందనీ హెచ్చరించకుండా... వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే  హుందాగా ఉంటుంది. ఇదే ఫిర్యాదు ప్రధానో లేక ఏ కేంద్రమంత్రో, ఏ అధికార పార్టీ ప్రతినిధో  చేస్తే అప్పుడు కూడా ఎన్నికల సంఘం ఇలానే అంటుందా ?...

2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తన నియోజకవర్గంలో 15 వేల ఓట్లు గల్లంతయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఐలాపూర్ గ్రామంలో 950 ఓట్లుంటే, ఓటర్ల జాబితాలో అవి1650 ఓట్లకు  ఎలా పెరిగాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అప్పుడే ఫిర్యాదు చేసాననీ, ఇప్పటి సిఇఓకు కూడా కంప్లయింట్  చేసానని బిజెపి పార్లమెంటు సభ్యుడు ఎం.రఘునందన్ రావు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం చివరి దశలో ... కొత్త రాష్ట్రం ఆవిర్భావ సమయంలో ఎన్నికలకు ముందు...  ఆంధ్రావాళ్ళ ఓట్లు, సమైక్యవాదులుగా గుర్తించిన తెలంగాణావాసుల ఓట్లు ... ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున గల్లంతయినట్లు అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఇక మర్రి శశిధర్ రెడ్డి అయితే ఓటర్ల జాబితామీద చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రతిసారీ చాలా ఫిర్యాదులు చేస్తుంటారు.

 

ఈ ఓట్ల దొంగతనం నిజమేనా !!!

నిజమే అయితే ఎందుకు జరుగు తున్నది ?

ఎలా జరుగుతున్నది !!!


ఓటర్ల జాబితాలో అవకతవకలను ప్రధానంగా రెండు తరగతులుగా విభజింవచ్చు

1.     కాకతాళీయంగా లేదా నిర్లక్ష్యంతో జరిగేవి

2.     ఉద్దేశ పూర్వకంగా జరిగేవి.

రెండోదే ఎక్కువ అభ్యంతరకరం, నేరం కూడా. అయినా దాని బీజాలు మొదటి దానిలో ఉంటాయి. అందువల్ల దానిని క్లుప్తంగా చూద్దాం...


ఓటర్ల జాబితా : ఇదే తొలి దశ. ఎన్నికలకు ఇదే కీలక, మౌలిక డాక్యుమెంట్. కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి జరిపే ప్రతి ఎన్నికకూ ఇదే ఆధారం.  ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తమ తరఫున ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుని  పంపాలంటే... ఈ జాబితా ఆధారం మీదే మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా ఆధారపడి ఉంది... అటువంటి ఆధారశిల మాత్రం- అట్టడుగున పనిచేసే బిఎల్‌ఓ స్థాయినుండి కేంద్ర ఎన్నికల సంఘంలోని ఉన్నత స్థాయి అధికారి వరకు నిర్లక్ష్యానికి గురవుతుంటుంది. ఎన్నికల ప్రక్రియ మొదలయిన దగ్గరి నుండీ అందరూ దీనిని గురించే మాట్లాడుతుంటారు...అంతే తప్ప దాని కచ్చితత్వాన్ని గురించి పట్టించుకోరు....

సాంకేతికంగా మనం ఎంత అభివృద్ధి చెందామో చూపడానికి...  ఆధార్ కార్డ్, మొబైల్ బ్యాంకింగే సాక్ష్యం. అయినా  ఓటర్ల జాబితా రూపకల్పన  పద్ధతి70 ఏళ్ళ కింద ఎలా ఉందో ఇప్పటికీ  దాదాపు అలాగే ఉంది.            ‘మీ ఓటు మీ హక్కు’ అంటూ ఊదరగొట్టడానికి... కోట్ల రూపాయలు రకరకాల ప్రచారం మీద, కొత్త కొత్త యాప్ ల మీద ఎన్నికల సంఘం ఖర్చు పెడుతుంది తప్ప ఎన్నికలు త్వరలో లేదా ఐదేళ్ళకు ఒకసారి రావడం ఖాయం అని తెలిసినా... చివరి నిమిషం వరకూ ఓటరు జాబితా ప్రక్షాళన గురించి పట్టించుకోరు. (చేర్పులు, మార్పుల గురించి మాట్లాడడం లేదు. జాబితాలో వివరాలు వాస్తవాలేనా, ఏదయినా తప్పు సమాచారం ఉందా...వంటివి)

ఎన్నికల సంఘంలో అత్యంత తక్కువ స్థాయి అధికారి బిఎల్ ఓ (బూత్ లెవల్ ఆఫీసర్). ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో గరిష్ఠంగా 1500 ఓట్లుంటాయి.  ఆ పరిధిలో పనిచేసే బిఎల్ ఓ స్వయంగా ఇంటింటికీ వెళ్ళి కొత్త ఓటర్ల నమోదు, అప్పటికే ఉన్న ఓటర్ల సమాచారం స్వయంగా పరిశీలించి వాస్తవాలతో నివేదికలు పంపితే...  పైన సూపర్‌వైజర్, ఎఇఆర్ఓ, ఇఆర్‌ఓ, డిఇఓల తనిఖీలన్నీ పూర్తి చేసుకుని తుది జాబితా  రాష్ట్ర సిఇఓకు చేరుకుంటుంది.

అయితే అస్త్యవస్తాలకు బీజాలు బిఎల్‌ఓ స్థాయిలోనే పడతాయి. స్వయంగా గడపగడపకూ పోరు,  పోయినట్లు రికార్డులు చూపుతారు. చాలా చోట్ల ఔట్ సోర్సింగ్ సిబ్బందిని లేదా తాత్కాలికంగా అందుబాటులో ఉండే వారిని పంపి మమ అనిపిస్తారు.  ఒక కుటుంబంలో వీరు వెళ్ళినప్పుడు ఒకరో ఇద్దరో ఉంటారు... మిగతా వారి గురించి ఆ కుటుంబ సభ్యులు ఏది చెబితే అది రాసుకుపోతారు. వెరిఫై చేసుకోరు.  ఇంట్లో ఆ సమయంలో లేని వారి లేదా ఇతర దేశాల్లో సెటిలయిన వారి వివరాల గురించి  రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేదా ఇతరత్రా డాక్యుమెంట్లు అడిగి తెప్పించుకుని తనిఖీ చేయవచ్చు. అవి చేయరు. ఆ ఇంటి నంబరు మీద నమోదయిన ఓటర్లలో -చనిపోయినవారు, ఇల్లు మారినవారు, నకిలీ ఓటర్ల  వాస్తవ సమాచారాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోరు. (ఫిర్యాదులు అందినప్పుడుకూడా పైనుంచి కింది దాకా అందరూ బిఎల్‌ఓ నే అడుగుతారు. అతను ఎంత చెబితే అంత... సిఇఓ కు నేరుగా ఫిర్యాదులు అంది గొడవ జరిగేటట్లుంది అన్నప్పుడు పైఅధికారులు స్వయంగా వెళ్లి చూసి నివేదికలు పంపుతారు. ఎన్నికల సమయంలో అధికార పక్షం వారు తప్ప, సెలబ్రిటీలు తప్ప మరే నాయకుడు ఫిర్యాదు చేసినా అందరూ తేలిగ్గా తీసుకుంటారు. (మీ ఓటు చెక్ చేసుకోండి అంటూ ఇంకా చాలా హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఇచ్చినా అవి కంటితుడుపే).

-ములుగు రాజేశ్వర రావు

 

(ఉద్దేశపూర్వకంగా ఓట్ల దొంగతనం ఎలా జరుగుతుందో తదుపరి వ్యాసంలో చూద్దాం)


భారత ఎన్నికల సంఘం ప్రధాన నినాదం ఏమిటంటే....

“No Voter to be left behind”

అర్హుడైన ఏ ఒక్క పౌరుడూ తన ఓటు హక్కు కోల్పోవకూడదు’’

భారత పౌరుడయి ఉండి, 18 ఏళ్ళు నిండి సదరు పోలింగ్ కేంద్రం పరిధిలోశాశ్వతంగా లేదా తాత్కాలికంగా నివాసం ఉంటున్న వారు ఓటరుగా నమోదుకు అర్హులు.. అన్నది మౌలిక సూత్రం.

ఆచరణలో ఇది ఎంత ఉదాత్తంగా ఉంటుందో చూడాలంటే...

ఇల్లే ఉండాల్సిన అవసరం లేదు, ఫుట్‌పాత్‌ల మీద, షెడ్లలో ఉంటూ జీవనం గడుపుతున్న వారు కూడా నివాసంతాలూకు రుజువు లేకపోయినా  ఓటరు జాబితాలో చేర్చడానికి అర్హులే. వారున్న ప్రాంతాన్ని బిఎల్‌ఓ సందర్శించి (రెండు మూడు సార్లు) వారు అక్కడే ఉంటున్నట్లు నిర్ధారిస్తే చాలు.. అలా ఫారం – 6 ద్వారా వారిని ఓటరుజాబితాలో చేరుస్తారు.

 క్రమం తప్పకుండా నిద్రకు  బసకు వచ్చిపోయేవారు కూడా అర్హులే... వారు అక్కడే ఉండి వంట చేసుకుంటున్నట్లు లేదా  తింటున్నట్లు కూడా రుజువులు పనిలేదు. మధ్య మధ్యలో అక్కడ నిద్రించకపోయినా... ఆ వ్యక్తి సదరు ప్రదేశంలోనే ఎక్కువ సార్లు నిద్రిస్తున్నాడని రూఢి అయితే చాలు... వారూ అర్హులే.

నివాస ధృవీకరణ లేకపోయినా సెక్స్ వర్కర్లు కూడా అర్హులే... బిఎల్‌ఓ వ్యక్తిగతంగా సందర్శించి నిర్ధారిస్తే చాలు. వారూ ఓటర్లవుతారు.



 

గుడిని నమ్ముతాం.. మరి పార్లమెంటునో !!!

 

S-400 Game Changer

 

వార్త: ఆపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్ కు చెందిన ఆరు విమానాలను ధ్వంసం చేసాం-అని మన ఎయిర్ ఛీప్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ బెంగళూర్ లో శనివారం(ఆగస్టు 9న) ప్రకటిస్తూ...దాని తాలూకు శాటిలైట్ ఛాయా చిత్రాలను ప్రదర్శించారు. ఈ ఆపరేషన్ లో పాకిస్థాన్ కు జరిగిన నష్టంపై భారత్ సైనికాధికారి బహిరంగంగా ప్రకటన చేయడం ఇదే మొదటిసారి.

* * *

కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి.. అంటూ ఆపరేషన్ సిందూర్ ను అర్థంతరంగా ఆపివేసిన తరువాత ... చాలా అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం అయిన నేపథ్యంలో పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పరచి దీనిపై దేశ ప్రజలకు పూర్తిగా వివరణ ఇవ్వాలని  ప్రతిపక్షాలు కోరాయి. అయితే ప్రత్యేకంగా సమావేశపరచలేదు కానీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా  దీనిపై రెండు రోజుల చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. అప్పటిదాకా ప్రభుత్వం బయట చెబుతూ వచ్చినవే సభలో కూడా చెప్పిందితప్ప అదనంగా మరే సమాచారం ఇవ్వలేదు, అనుమానాలు తీర్చలేదు. సభలో చర్చ ముగిసింది....

ఇప్పుడు..ఉన్నట్టుండి  అత్యున్నత సైనిక అధికారి ఎయిర్ ఛీప్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్  కొత్త విషయం ప్రకటించారు. మున్ముందు ఇంకా ఎవరు ఎప్పుడు కొత్త విషయాలు ప్రకటిస్తారో తెలియని పరిస్థితిలో... ఒక మౌలికమైన ప్రశ్న

పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్న సందర్భంలోనే అత్యున్నత సైనికాధికారి సభ వెలుపల ఒక ప్రకటన చేసి..అది కూడా ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడించకుండా దాచిన విషయాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రభుత్వం ఈ విషయాన్ని ఇప్పటివరకు సభ ముందుంచనప్పుడు ఇది పార్లమెంటును అవమానించడం కాదా..??? ఔననే ఎందుకు అనుకోవాల్సింది వస్తుందంటే...

 

సర్వోన్నత సభ !!!

మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. పార్లమెంటు సర్వోన్నత  చట్ట సభ. జాతీయ ప్రాముఖ్యం ఉన్న విషయాలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను ఈ సభలో ప్రజా ప్రతినిధులు పరిశీలించి, చర్చించి నిర్ణయిస్తారు. వాటినే ప్రభుత్వం అమలు చేస్తుంది. ముందు కాకపోయినా తరువాత అయినా ప్రభుత్వం సభ ముందుంచి ఆమోదం తీసుకుంటుంది.   ప్రభుత్వం అధికారం అనుభవిస్తున్నా... అలా పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది. అలా ఉండి తీరాలి. ఈ సభల్లో దాపరికం ఉండకూడదు. (కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప... అదిక్కడ మనకు ప్రస్తుత చర్చనీయాంశంలో వర్తించదు). ప్రత్యక్ష ప్రసారాల ద్వారా, పత్రికా విలేకరుల ద్వారా  ఈ సభల సమాచారం అంతా ప్రజలకు చేరుతుంటుంది. 

మరటువంటప్పుడు జాతీయ భద్రతకు  సంబంధించి  ఒక సీనియర్ సైనికాధికారి బయట చెప్పిన ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు సభలో చెప్పకుండా దాచింది.... 

అంటే ప్రభుత్వం పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోవడం లేదని భావించాల్సి వస్తుంది కదా...!!!.

అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఇది వాంఛనీయం కాదు...ఇవ్వాళ అధికారపక్షం రేపు ప్రతిపక్షం అయినప్పుడు... వారికి ఇలా ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుందా !!!  50ఏళ్ళ నాటి ఎమర్జన్సీని  ఇప్పుడు కూడా తిట్టగలిగేంత నైతికత, ఉన్నత విలువలు తమకు ఉన్నాయని ప్రకటించుకుంటున్నప్పుడు... జరుగుతున్నదేమిటి ???

ఆపరేషన్ సిందూర్ పై కొన్ని అనుమానాలు చూద్దాం...

1.     మన దెబ్బకు తట్టుకోలేక పాకిస్థాన్ కాళ్ళబేరానికి వచ్చింది, కాల్పుల విరమణ ప్రతిపాదన అదే చేసింది. మనం అంగీకరించాం. అంతవరకు ఓకే... మరి మనం పాకిస్థాన్ కేమయినా  షరతులు విధించామా ? ఒకవేళ విధిస్తే ఆ షరతులుఏమిటి ?

2.     ఏ షరతులు లేకుండానే మనం అకస్మాత్తుగా కాల్పుల విరమణ పాటించేసామా ...?

3.      ఒకవేళ అదే నిజమయితే ఎవరి ఒత్తిడికి తలఒగ్గి అలా అంగీకరించాం ..???

4.     భారత్-పాక్ వ్యవహారాల్లో మూడో దేశం మధ్యవర్తిత్వం వహించకూడదనేది మనం నిక్కచ్చిగా పాటిస్తున్న విధానం... మరి కాల్పుల విరమణ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు మొదట ఎలా ప్రకటించారు ? అది కూడా ... తన ప్రభావం/ప్రమేయంతోనే, వాణిజ్య  సంబంధాల బూచితో సాధ్యమయిందని ఎలా ప్రకటించారు ? ఒకసారి కాదు.. ఇప్పటికీ అలా ప్రకటిస్తూ పోతున్నా... నేరుగా ఆయన ప్రకటనలను ప్రభుత్వం ఎందుకు ఖండించి వాటిని నిలుపుదల చేయించడం లేదు ?

5.     ఒకవేళ పాకిస్థాన్ తో మనకు అవగాహన లేదా అంగీకారం కుదిరి ఉంటే ... మనకు కలిగిన ప్రయోజనం (లాభం)ఏమిటి ?

(మళ్ళీ మనవైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయకుండా చావుదెబ్బ తీసాం.. అని మనం పదేపదే ప్రకటిస్తున్నప్పుడు... ఇంకా సీమాంతర ఉగ్రవాదం ఎలా కొనసాగుతున్నది ? పాకిస్థాన్ కూడా మునుపటిలాగానే ప్రేలాపనలు ఎలా చేయగలుగుతున్నది ?)

6.     రాజకీయంగా మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టే మేం అతి తక్కువ కాలంలో శత్రువుని కాళ్ళబేరానికి తీసుకురాగలిగాం..అని సైనిక దళాలు ప్రకటిస్తున్నాయి.. అది ప్రశంసనీయం. మరి అంతటి ఘన విజయాన్ని వారు బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చినప్పుడు... శత్రువు అడిగీ అడగక ముందే ఎటువంటి లాభసాటి షరతులతో ఒప్పందం చేసుకోకుండానే  సైనికదళాల చర్యలను ఎందుకు ఆపేసారు ? ఇక్కడ రాజకీయం ఎలా చొరబడింది ?


ఈ అనుమానాలన్నింటినీ తీర్చాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వం పై ఉంటుంది.

 ప్రభుత్వం ప్రజల ముందు ఉంచని ముఖ్యమైన సమాచారాన్ని  సంబంధిత అధికారులు

ఎక్కడో కాకతాళీయంగా బయటపెడుతున్నప్పుడు...

దానిని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ?

 

ఆధ్యాత్మికంగా మందిరాన్ని నమ్మినప్పుడు

రాజకీయంగా పార్లమెంటును  కూడా నమ్మాలి కదా !!!

 

-ములుగు రాజేశ్వర రావు

........

 (అధికార పార్టీ భక్తులు జుట్టు పీక్కోకండి... 

నేనిక్కడ ప్రస్తావిస్తున్నది నైతిక, సాంకేతిక అంశాలను మాత్రమే...

దీనిని రాజకీయం చేయకండి... ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇది వర్తిస్తుంది.)


నా వేలు నీ కంట్లో... నీ వేలు నా నోట్లో...

 


కర్ణాటకలో 2024లో జరిగిన సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలో ఉద్దేశపూర్వకంగా అక్రమాలు జరిగినట్లు తమ సర్వేలో తేలిందని కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై – భారత ఎన్నికల సంఘం, మూడు రాష్ట్రాల్లోని ఎన్నికల ప్రధాన అధికారులు స్పందించిన తీరు చూస్తే... ‘‘నా వేలు నీ కంట్లో పెడతా.. నీ వేలు నా నోట్లో పెట్టు..’’ అన్న చందాన ఉన్నది కదూ !!!

‘‘ఒకవేళ రాహుల్ గాంధీ తన ఆరోపణలకు  చూపిన సాక్ష్యాధారాలు తప్పని తేలితే... భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 227/229 కింద ఆయనకు మూడేళ్ళ వరకు జైలు శిక్ష, ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950 లోని సెక్షన్ 31 కింద ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది’’ అని మూడు  సంబంధిత రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులు ఆయనకు రాసిన లేఖలో హెచ్చరించారు.


తప్పేముంది... కరెక్టే. ఏ పేచీ లేదు దీనితో... 

కానీ తిరకాసు ఎక్కడుందీ...అంటే...

రాహుల్ గాంధీనే అయినా,  సామాన్య పౌరుడు  అయినా...వారి  ఆరోపణలు, దాని తాలూకు సాక్ష్యాధారాలను ఓటర్ల నమోదు నిబంధన 20(3)(బి) కింద నిర్ణీత ఫారంలో డిక్లరేషన్ ఇవ్వాలి. అలా ఇస్తూ...‘‘ నాకు తెలిసినంత వరకు, నేను నమ్మినంత వరకు ఇవి నిజాలు’’ అన రాసి సంతకం చేయాలి’’... అని వారు ఆయనను కోరుతూ లేఖలు రాసారు. ఆ ఆరోపణలు అబద్దమని తేలితే ఆయనకు జైలు శిక్ష తప్పదట.

మరి నిజమని తేలితేనో...???  నిబంధనల ప్రకారం వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తారట. అంతే తప్ప దురుద్దేశంతో జరిగిన ఆ అక్రమాలకు, దానివల్ల జరిగిన అపారమైన నష్టానికి బాధ్యులయిన వారిపై ఏం చర్యలుంటాయో ఎక్కడా మాట మాత్రం కూడా వాటిలో ప్రస్తావించలేదు.

రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే...‘‘నేను ఒక రాజకీయ నాయకుడిని. నా ఆరోపణలకు సాక్ష్యంగా ఈ ఆధారాలను  బహిరంగంగా ప్రజల ముందుంచా.. ఇదే ప్రమాణం చేసి నేను సమర్పిస్తునట్లు..’’

రాహుల్ గాంధీ ఈ దేశంలో ఒక సాధారణ పౌరుడే అయినా కేవలం సామాన్య పౌరుడి హోదా కాదు ఆయనది. కొన్ని అంశాలలో పార్లమెంటే సుప్రీం. అటువంటి పార్లమెంటులో సభ్యుడు, ప్రజా ప్రతినిధుల సభ అయిన లోక్ సభలో ప్రతిపక్షనాయకుడు, ఒక జాతీయ పార్టీ అగ్రనేత...  ఆ హోదాలో ఆయన ఒక ఫిర్యాదును పత్రికా విలేకరుల సమావేశంలో బహిరంగంగానే చేసారు. దానికితన దగ్గరున్న  ఆధారాలు కూడా చూపుతున్నారు,

ఒక ప్రభుత్వ వ్యవస్థకు అది చాలు ఫిర్యాదులను పరిశీలించి నిజనిర్ధారణ చేసి నివేదిక ఇవ్వడానికి.  ఎవరూ ఫిర్యాదు చేయకుండానే... కేవలం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా కోర్టులు, మానవ హక్కుల సంఘాలు వాటిని సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నాయి కదా! అయినా ‘‘కాగితం రాసివ్వు, ఫలానా రూలు ప్రకారం ఫలానా ఫారం నింపు, ఫలానా ప్రమాణం చెయ్యి, ఫలానా చోట సంతకం పెట్టు...’’ అని అడగడం ఏమిటి ?

ఆ తరువాత కూడా అది నిజమని తేలితే..దానికి బాధ్యులైన వారిపై తీసుకునే చర్యలు చెప్పి ప్రజలకు నమ్మకం కలిగించకుండా... ఫిర్యాదుదారుకు ‘జైలు శిక్షల’ బెదిరింపులేమిటి ?’

కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయపార్టీ నాయకులు ఇటువంటి  హెచ్చరికలు చేయవచ్చు... అది రాజకీయంగా సమర్ధనీయం అవుతుంది. కానీ ఒక రాజ్యాంగ సంస్థఅయిన ఎన్నికల సంఘం అధికారులు ఇలా బ్లాక్ మెయిల్ ధోరణి చూపడమేమిటి ?

తమ దగ్గరికి వచ్చిన ప్రతి దావా విషయంలో దానికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు  సుప్రీంకోర్టు కూడా ఇలాగే హెచ్చరించ వచ్చు కదా !

హెచ్చరించొచ్చు... అధికారంలోఉన్నవారు, వారికి తైనాతీలుగా ఉన్న వ్యవస్థలు ఇలాగే  ఫిర్యాదుదారులను బెదిరిస్తూపోతే... ‘ప్రజాస్వామ్య’ దుకాణానికే కాదు... ప్రజలందరూ కూడా  నవరంధ్రాలకు సీల్ వేసుకునే రోజు ఎంతో దూరంలో  ఉండదు !!!

- ములుగు రాజేశ్వర రావు

..............

కేసీఆర్ సార్ ! మీరు మళ్ళీ రావాలి సార్...

 

 

‘‘ఔను సార్.. మీరు మళ్ళీ రావాలి ... మీ అభిమానులం చాలా మందిమి మీకోసం ఎదురుచూస్తున్నాం సార్... మీరు మా అభిమాన నాయకుడు సార్..  ఉద్యమ కథానాయకుడిగానే కాదు, ప్రజానాయకుడిగా మీరంటే మాకు పిచ్చి అభిమానం సార్...’’

 

...దాదాపుగా సగం తెలంగాణ సమాజం అంతటా మనసు పొరల్లో గుసగుసలాడుతున్న భావన ఇది.

 

మరి నిన్నమొన్న ఎలక్షన్లో అంత తుక్కుగా ఓడించినా...

ఇంకా ఆయనను జనం అభిమానిస్తున్నారంటారా ???

* * *

ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాలంటే ముందు ఒక విషయంలో మనం స్పష్టత తెచ్చుకోవాలి. కథానాయకులు వేరు, రాజకీయ నాయకులు వేరు, ప్రజానాయకులు వేరు... ఇలా చాలామంది ఉన్నా...  ప్రజానాయకుల తరగతికి చెందిన వారు చాలా చాలా అరుదుగా ఉంటారు.

ప్రజానాయకులంటే నా దృష్టిలో... ప్రజలతో సులభంగా కనెక్ట్ అయిపోవడం,  తన ప్రసంగ ధాటితో ప్రజలను సమ్మోహన పరచడం,  చెరువులో చేపలా జనంలో దూసుకుపోవడం, ఎంత నియంతగా ఉన్నా సమయ సందర్భాలను బట్టీ మానవత్వాన్ని ప్రశంసనీయంగా ప్రదర్శించడం, కళాత్మక హృదయం కలిగి ఉండడం, వారి మాట వినాలనీ, చూడాలని జనం తహతహలాడిపోవడం..అలా... ప్రజలకు నచ్చడం, వారు మెచ్చడం.... ఎన్టీఆర్, ఇందిరాగాంధీలు ఈ కోవకు చెందినవారే. వీరిద్దరిదీ కేసిఆర్ కంటే ఎక్కువ రేంజ్... వారు కూడా వ్యక్తిగతంగా ఏ సంక్షోభం ఎదురయినా... మరెక్కడా చెప్పుకోకుండా నేరుగా జనం లోకి దూకేసి వారితోనే చెప్పుకోవడానికి ఇష్టపడేవారు... ఈ చివరి అంశం ఒక్కటే కేసీఆర్ బలహీనత... విజయోన్మాదంలో ఉన్న హుషారు... ఆయన వైఫల్యంలో చూపడు.  చేతులెత్తేస్తాడు. కాళ్లుబారజాపేస్తాడు. శ్రీఆంజనేయం, వీరాంజనేయం అంటూ  స్తుతించాలి. అప్పుడు తన శక్తి తాను తెలుసుకుని విజృంభిస్తాడు. అటువంటి సందర్భాల్లో...  ధూపం వేయగల జయశంకర్ సారులాంటి వారు లేకపోవడం ఇప్పుడు ఆయనకు  మైనస్ అయింది.

చంద్రబాబు నాయుడు, పి.వి.నరసింహారావు లాంటి వాళ్లు... రాజకీయ నాయకులు, వ్యూహకర్తలు, మ్యానిపులేటర్లే గానీ ప్రజానాయకులకోవలోకి రారు. మోదీ - సమ్మోహన పరిచే ప్రజానాయకుడేగానీ, ఆయన మాటలు వింటూంటే... కొత్త సిటీలో ఆటో ఎక్కి... డ్రయివర్ను అనుమానిస్తూ దిక్కులు చూస్తూ పోతున్నట్లు ఉంటుంది. ఎక్కడో నరాలు భయంతో మెలికలుపడుతుంటాయి, ఎక్కడికి చేరుకుంటామో అర్థంకాక గుండె లయతప్పుతున్నట్లు ఉంటుంది.

 

కేసీఆర్ సార్ ! 

మిమ్మల్ని ప్రజలు మొన్న ఓడించిది మీమీది ద్వేషంతో కాదు.. మీరు చాలా వర్గాల ప్రజల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేసినందువల్ల, ... దానికంటే కూడా మీరు ఎవరికీ  అందుబాటులో లేకపోవడంవల్ల... మీనుంచి రూపాయి ఆశించినవాడికి ఐదురూపాయలు అప్పనంగా ప్రకటిస్తూ ... మీమీద ఆయా వర్గాలవారి అంచనాలు పెంచి వారిని నిరాశపరచడం వల్ల... అన్నిటికీ మించి మీ కంటే మీ పార్టీ నాయకులకు మమ్మల్ని, మా సమస్యల్ని పట్టించుకునేంత తీరిక లేకపోవడం వల్ల.... అది ధర్మాగ్రహమేకానీ ద్వేషం మాత్రం కాదు సార్...

మీరు కూడా మనకెదురులేదన్న ధీమాలో... తిక్కగా వ్యవహరించినా జనం మిమ్మల్ని గుడ్డిగా అభిమానించారు...  అనడానికి ఆర్టీసి సమ్మె ఒక మంచి ఉదాహరణ. అన్నిరోజులు సమ్మె చేసి అంతమంది కార్మికులు చనిపోతున్నా... మీరు సంస్థను నిర్వీర్యం చేస్తూ వారిని మరింత కుంగుబాటుకు గురి చేసినా... ముగింపు దశలో  ఒక్కసారిగా వారిని మీరు దగ్గరకు తీసుకుని ఓదార్చి, వరాల జల్లు కురిపించిన మరుక్షణం వారు అంత పెద్ద క్షోభను ఒక్కసారిగా మర్చిపోయి మిమ్మల్ని ఆకాశానికెత్తారు కదా... అప్పుడు మీరూ మురిసిపోయారు కదా !!!

ఇప్పుడు మీకు కొరుకుడు పడనిది రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు. తిరుగులేకుండా దూసుకుపోతున్న మీకు ఇన్నాళ్టికి మీ వ్యూహాలను, మాటలను పుణికిపుచ్చుకుని అచ్చం మీలాగే పోతుండడంతో...  మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉన్న మాట వాస్తవమే. అయినా...ఇది కాంగ్రెస్ పార్టీ మీది అభిమానంతో  జనం తెచ్చుకున్న ప్రభుత్వం కాదు కదా సారూ.... తండ్రి కొడితే తల్లి ఒళ్ళో తలదాచుకున్నట్టు అక్కడికి పోయారు.

వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి మీద ప్రేమ, అభిమానం ఉందో లేదో తెలియదు కానీ ప్రజలకు ఆయన మీద ద్వేషం మాత్రం లేదు.  సానుభూతి ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. కారణం ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాకుండా తికమకపెడుతున్న విషయం... కాంగ్రెస్ పార్టీ  నాయకుల వ్యవహారం. అసలిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనా ? అని జనం రోజూ ఆశ్చర్యపోతున్నారు. నిజ్జంగా కాం గ్రెస్సే అయితే సిఎం సీటు కింద పొద్దున లేచిన దగ్గరనుంచీ ఎవడి కుంపటి వాడు  రాజేస్తుండాలి కదా... అది లేకపోగా ఆ సఖ్యత, ఐక్యత చూసి అవాక్కవుతున్నారు. అందరూ అనుమానిస్తున్నదేమిటంటే... రేవంత్ పక్కలో పాములు పెట్టుకుని పడుకుంటున్నాడు.. పాపం.. అని సానుభూతి...

సారూ... దాని సంగతి పక్కనబెట్టండి.. గుళ్ళల్లో, యాగాల్లో పూజలు చేసేటప్పుడు మీరు సతీసమేతంగా అమితమైన భక్తిప్రపత్తులతో కార్యక్రమాలను జరిపిస్తుంటే... జనం రెప్ప వాల్చకుండా వారి చుట్టాలను చూసినట్లు చూస్తుండేవాళ్ళు. ఇక మీ మాటలు.. ఒకసారి తూటాల్లా, ఒకపరి సుగంధ పుష్పాల్లా... మధ్యమధ్యలో నవ్వులజల్లులు చిలకరిస్తూ, మీ పార్టీ నాయకుల మీదా, ప్రత్యర్థుల మీద మీరు చెణుకులు విసురుతూ... అది ప్రెస్ మీట్ కావచ్చు, బహిరంగ సభ కావచ్చు..  చిన్నా పెద్దా అందరూ పనులు మానుకుని టీవీల ముందు చేరి  మాయాబజార్ సినిమా చూస్తున్నట్లు మీ వాక్చాతుర్యానికి ఆనందంతో మెలికలు తిరిగిపోతూ వాళ్ళల్లో వాళ్లే తలచుకుని తలచుకుని నవ్వుకుంటూండేవాళ్ళు. ఆంధ్రావాలా భాగోఅన్నా, తోటి ప్రత్యర్థి రాజకీయ నాయకులను సన్నాసులన్నా, ‘పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడ్ని పోచమ్మ కొడతదిఅని సామెతలు గుప్పించినా.. మీ శత్రువులతో సహా అందరూ తేలిగ్గా తీసుకుని ఆనందిస్తూండేవారు.

తెలంగాణ పునర్నిర్మాణంఅని మీరు రోజుకోరకంగా చిటికెల పందిరి వేసి చూపుతున్నా, అరచేతిలో స్వర్గాన్ని అలవోకగా దించేస్తున్నా... రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సమస్యలపట్ల మీకున్న అవగాహన, తపన తలచుకుని పొంగిపోతుండేవారు.

మీ తరువాత వారసులుగా ఎదుగుతున్న మీ కుటుంబ సభ్యులను కూడా ఆదరించారు కదా సారూ. ఒక రాజకీయ కుటుంబం అంటే.. ‘‘ చూడండి.. ఆ ప్రేమ, ఆ అనురాగాలు, ఆ ప్రతిభ .. పులి కడుపున పులులే పుడతాయి’’ అని ముచ్చటపడిపోయారు. చంద్రబాబు, లోకేశ్‌లతో పోల్చుకుని పిసరంత మార్కులు మీకే ఎక్కువ వేస్తుండేవాళ్ళు. మీమీద మీకు కూడా ఎంతగా నమ్మకం ఎక్కువయిపోయిందంటే... ‘‘సోనియా సరైన సమయంలో రాహుల్‌కు పట్టాభిషేకం చేయలేదు’’ అని కామెంట్లు కూడా వదిలారు. కానీ మీరు పెట్టుకున్న పట్టాభిషేక ముహూర్తానికి  ప్చ్..ఎదురుగాలి తగిలింది. మన చేతుల్లో ఉండదు కదా సారూ....

ఎప్పుడో చిన్న జంప్చేయబోయి వెంటనే కాలు వెనక్కి తీసుకున్న మీ మేనల్లుడు ... మీరు పెట్టిన అన్ని అగ్నిపరీక్షల్లో అత్యంత సమర్ధుడిగా గోల్డ్ మెడల్ తెచ్చుకుంటున్నా.. మీరింకా అనుమానిస్తూనే ఉన్నారు. ఆ మేనల్లుడుకూడా చంద్రబాబంత ఓపికగా ఉంటూ పార్టీమీద పట్టు సడలకుండా చూసుకుంటున్నాడు.

మిమ్మల్ని చూడాలనీ, మీ మాట వినాలని అందరూ తహతహలాడుతున్నారు. మీరేమో బయటికి రాకుండా ప్రజానీకాన్ని నిరాశపరుస్తూ... జనం ముందుకు మీ కుటుంబ సభ్యులను వదులుతున్నారు. మీరు లేకుండా వారిని చూస్తుంటే...  పులివేషాలు, వీథిబాగోతాలు చూస్తున్నట్లుంది. పక్కన చేరిన జనం కూడా  తప్పనిసరి తద్దినానికి వచ్చిన భోక్తల్లాగా కనిపిస్తున్నారు. వీళ్ళే ఒకప్పుడు మీవెంట నడిచినప్పుడు పోటీలుపడి  గొంతుచించుకునే వాళ్ళు. ఇప్పుడు సంతాపసభల్లో కూర్చున్నట్లు కూర్చుంటున్నారు.

కేసీఆర్ సార్ !!!

తెలంగాణ సమాజానికి పుట్టుకతో వచ్చిన ఒక ప్రత్యేక గుణం ఉంది. వారు ఒకపట్టాన ఎవర్నీ నమ్మరు. నమ్మితే గుడ్డిగా నమ్ముతారు... అవసరమయితే ప్రాణం కూడా తృణప్రాయంగా వదిలేస్తారు. ఈ విషయం మాకంటే మీకే ఎక్కువగా తెలుసు. కానీ మీకు తెలియనిదేమిటంటే...

వాళ్ళు మిమ్మల్ని ఇంకా అభిమానిస్తున్నారు సార్, నమ్ముతున్నారు కూడా. ఆ అభిమానం, నమ్మకం పోయిననాడు .. వారి స్పందన మీకు... ఊహకు అందనంత తీవ్రంగా ఉంటుంది.  చెన్నారెడ్డిని నమ్మారు కదా.. ఆ తరువాత ఏమయింది... రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా... ఇంకా ఏవేవో చేసినా... తెలంగాణ ద్రోహిగానే చరిత్రలో శిలాక్షరాలతో రాసిపెట్టుకున్నారు.

చావునోట్లో తలపెట్టిన’...  అని మీఅంతట మీరే ఈ మధ్య పదేపదే చెప్పుకుంటున్నారు.జనం ఎక్కడ మర్చిపోతారోనని మీ వారసులు కూడా మళ్ళీమళ్ళీ గుర్తు చేస్తుంటారు. సారూ... ఆరోజు మీరు జ్యూస్ తాగడం, ఆ వీడియో లీక్ కావడం, అది చూసి ఉస్మానియాలో పిల్లలు తిరగబడడం, తర్వాత మీరు నిమ్స్ లో చేరి కథ నడపడం ... అన్నీ జనానికి గుర్తున్నా.... అదేదో ఒక ఎత్తుగడ అని సరిపుచ్చుకున్నారు తప్ప ఎప్పుడూ ఎకసక్కెం చేసి మిమ్మల్ని  బాధపెట్టలేదు. ఒకసారి నమ్మితే ... ఇటువంటి వాటిని మన జనం పట్టించుకోరు సారూ.. అలా నమ్మారు కదా !

కాళేశ్వరం అంత పెద్ద వ్యవహారమే అయినా మీరు దాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నా... అదేకాదు,  మీ గత పాలన తాలూకు ఇతరత్రా అవినీతిని ప్రజలు ఇప్పుడు కొత్తగా చూస్తున్నా.... బాధను మింగుకుని కడుపులో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారంటే... మీ మీద గుడ్డి ప్రేమ ఉన్నట్లే  కదా !  ఇక...  మీరే మళ్లీ  వారిని ముందుండి నడపాలని కూడా వారు కోరుకుంటున్నట్లు  ఇప్పటివరకు అయితే ఎక్కడా దాఖలాలు లేవు. కానీ, మీరు వారి మధ్యఉండాలని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు.

ఒక్కటి మాత్రం నిజం.  మీరు మారాలి. మీ ధోరణి మారాలి. ‘‘అధికారం ముఖ్యం కాదు. ప్రజాసేవే మా అంతిమ లక్ష్యం’’ అనే పద్ధతిలో రండి. ద్వేష రాజకీయాలు పూర్తిగా పక్కనబెట్టండి. మీ స్వంత మీడియాను వదిలించుకోండి. దానివల్ల... ఏం లాభం చెప్పండి.. స్వకుచమర్ధనం తాలూకు సంతృప్తితప్ప.  దాన్ని  ఉంచుకున్నా ... మీకు డప్పుగా మార్చుకోకండి. చీటికిమాటికీ ప్రత్యర్థుల మీద మీ అక్కసు తీర్చుకోవడానికి దాన్ని వాడుకోకండి.

తెలంగాణ వచ్చిన తరువాత, అదీ ఏకంగా పదేళ్ళు.. రెండు సార్లు వరుసగా వారు మీకు అధికారం అప్పగించిన తరువాత కూడా ఇంకా చీప్‌గా భావోద్వేగాల మీద ఆధారపడకండి .. రివర్స్ కొడుతుంది. . మీ మాటల్లోనే  చెప్పాలంటే.. మీకు రిటర్న్ గిఫ్ట్ ... ఇస్తారు...చూసి తట్టుకోలేనంతగా...

మీ ప్రసంగాల్లో, మీ వారసుల ప్రసంగాల్లో... చంద్రబాబు ముఖంలో కనపడినట్లు...  అధికారం కోల్పోయిన ఆక్రోశం, అక్కసు రోజూ కనబడుతున్నది. దానిని లైజాల్ పెట్టి తుడిచేయండి.  ఎన్నికల లక్ష్యంతోనో, వారసులకు పట్టాభిషేకం కోసమో వస్తున్నట్లు ఎక్కడా ఆవగింజంత అనుమానం రాకుండా జాగ్రత్త పడండి. మీ ప్రతిభ, మీ సామర్ధ్యం, మీ వాక్చాతుర్యం, మీ ప్రసంగధాటి, మీ అనుభవం మీద ప్రజలకున్న  అభిమానం మరింత పెంచే ప్రయత్నం చేయండి. పాజిటివ్ ఆలోచనలతో, పాజిటివ్ ప్రణాళికలతో సరికొత్త కేసిఆర్ సారును మా మధ్యలో చూడాలన్నదే మా ఆకాంక్ష.

రండి కేసీఆర్...

 

అప్పుడు మీ అవసరం కొద్దీ మీరొచ్చారు.

మా అవసరం కొద్దీ  అప్పుడు స్వాగతించాం.

 

ఇప్పుడు మాకు అవసరం లేకపోయినా...

తెలంగాణ  రావడంలో సహాయపడినందుకు  కృతజ్ఞతగా

మిమ్మల్ని దూరం పెట్టలేక రమ్మంటున్నాం. ...

మాతో కలిసి ఉండండి, మాతో కలిసి నడవండి అంటున్నాం....

 

మీకు సాదర స్వాగతం...

పునః స్వాగతం..

-       ములుగు రాజేశ్వర రావు

......

 

    ‘‘ ఒక నదికి గానీ , ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో   దీనిని ‘ ప...